
గద్వాల, వెలుగు: కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతుల కష్టాలు తగ్గుముఖం పట్టాయని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తెలిపారు. బుధవారం ధరూర్ సబ్ స్టేషన్ ఆవరణలో నియోజకవర్గంలోని ఏడు గ్రామాలకు సంబంధించిన 200 ట్రాన్స్ఫార్మర్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో రైతులు చాలా ఇబ్బందులు పడేవారని తెలిపారు. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక రైతుల కష్టాలు తగ్గుతున్నాయని పేర్కొన్నారు.
విద్యుత్, సాగునీరు, రుణమాఫీ, సన్న వడ్లకు బోనస్, బ్యాంకు లోన్లు ఇప్పించడంతో రైతులకు మేలు జరిగిందన్నారు. కరెంట్ కష్టాలు తీర్చేందుకు సబ్ స్టేషన్ల నిర్మాణాన్ని చేపట్టడం జరుగుతుందన్నారు. నియోజకవర్గంలో కొత్తగా ఏడు సబ్స్టేషన్లు నిర్మిస్తున్నట్లు తెలిపారు. తాను ఎమ్మెల్యే అయ్యాక నియోజకవర్గంలో రూ.200 కోట్లతో 500 ట్రాన్స్ఫార్మర్లు పంపిణీ చేసినట్లు చెప్పారు. ఏఎంసీ చైర్మన్ హనుమంతు, గడ్డం కృష్ణారెడ్డి, రామన్ గౌడ్, విజయ్ కుమార్, పద్మ పాల్గొన్నారు.