పైసలివ్వకుంటే పని చేస్తలేరు .. పోల్ ​వేయాలన్నా.. వైర్లు గుంజాలన్నా డబ్బులే

పైసలివ్వకుంటే పని చేస్తలేరు .. పోల్ ​వేయాలన్నా.. వైర్లు గుంజాలన్నా డబ్బులే
  • లైన్​మెన్లు, సిబ్బంది ఇబ్బంది పెడుతున్నరు​ 
  • ఈఆర్సీ బహిరంగ విచారణలో రైతుల ఆవేదన
  • పశువుల షెడ్లకు ఫ్రీ కరెంట్​ఇవ్వాలని చైర్మన్​కు వినతి

హనుమకొండ, వెలుగు: కరెంట్​పోల్స్​వేయాలన్నా.. లూజ్​వైర్లు గుంజాలన్నా లైన్ మెన్లు, ఇతర క్షేత్రస్థాయి సిబ్బందికి పైసలు ఇవ్వాల్సిందే.. లేకుంటే పని చేస్తలేరని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ట్రాన్స్​ఫార్మర్లు రిపేర్​కు వచ్చినా.. వాటి తరలింపు, మరమ్మతుల భారాన్ని కూడా  తమపైనే వేస్తున్నారని వాపోయారు. టీజీఎన్​పీడీసీఎల్ 2025–-26 ఆర్థిక సంవత్సరానికి సవరించిన ఆదాయ ఆవశ్యకత, రిటైల్​సరఫరా ధరలు, క్రాస్​ సబ్సిడీ సర్ ఛార్జీల ప్రతిపాదనలపై తెలంగాణ విద్యుత్తు నియంత్రణ మండలి(టీజీఈఆర్సీ) ఛైర్మన్ జస్టిస్ దేవరాజు నాగార్జున్​ అధ్యక్షతన బుధవారం హనుమకొండ కలెక్టరేట్​లో బహిరంగ విచారణ నిర్వహించారు.

 ఎన్​పీడీసీఎల్ పరిధిలోని 17 జిల్లాల నుంచి  వచ్చిన 41 మంది వినియోగదారులు ​తమ అభిప్రాయాలను వెల్లడించారు. విద్యుత్​శాఖ అధికారులు ఫ్యూజులు వేయడానికి కూడా సరైన సమయంలో రాకపోవడం వల్ల రైతులు సొంతంగా రిపేర్​చేస్తూ ప్రమాదాలకు గురవుతున్నారని తెలిపారు. 

ట్రాన్స్ ఫార్మర్లు రోడ్డుకు షిఫ్ట్ చేయాలి

ట్రాన్స్ ఫార్మర్లు రిపేర్​కు వస్తే అధికారులు వాటిని ఉచితంగా తరలించి, రిపేర్​ చేయించాల్సిందిపోయి... తమపైనే భారం వేస్తున్నారని పలువురు రైతులు ఈఆర్సీ ఛైర్మన్​ దృష్టికి తీసుకువచ్చారు. ట్రాన్స్​ఫార్మర్లు పొలాల మధ్య ఉండటం వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయని, వాటిని రోడ్డు పక్కకు షిఫ్ట్​చేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. పొలాల మధ్య ఉన్న విద్యుత్​లైన్లు వేలాడుతుండటం వల్ల ప్రమాదాలు జరగుతున్నాయని, వాటిని తొలగించాలన్నారు. 

జగిత్యాల జిల్లాలో ఈ సమస్యగా ఎక్కువగా ఉందని తెలిపారు. హసన్​పర్తి మండలం జయగిరి శివారులోని సర్వే నంబర్ 59, 60లోని సాగు భూముల్లో విద్యుత్​వైర్లు వేలాడుతున్నాయని, వాటివల్ల రైతులు చనిపోయే ప్రమాదం ఉందని రడపాక పరంజ్యోతి అనే రైతు పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ స్లమ్​ ఏరియాల్లో విద్యుత్​బకాయిలు పెద్ద మొత్తంలో ఉండటం వల్ల వారు బిల్లులు కట్టలేకపోతున్నారని, అలాంటి వారికి వన్​ టైమ్ సెటిల్​మెంట్ కింద రాయితీ ఇవ్వాలని విన్నవించారు. 

సమస్యలన్నీ పరిష్కరిస్తాం : సీఎండీ వరుణ్ రెడ్డి

ప్రతీ గ్రామంలో సమావేశాలు నిర్వహించి, విద్యుత్​సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఎన్​పీడీసీఎల్​ సీఎండీ కర్నాటి వరుణ్​రెడ్డి అన్నారు. వినియోగదారులు ​చెప్పిన సమస్యలకు ఆయన వివరణ ఇచ్చారు. పొలాల  మధ్య ఉన్న ట్రాన్స్​ఫార్మర్లను రోడ్డు పక్కకు షిఫ్ట్ చేసేందుకు అంచనాలు రూపొందిస్తామన్నారు. అన్ని ట్రాన్స్​ఫార్మర్లపై 1912 టోల్ ఫ్రీ నంబర్ రాయించి, వినియోగదారులకు అందుబాటులో ఉంటామని చెప్పారు. 

ప్రతీ గ్రామ పంచాయతీ ఆఫీస్​ సిటిజన్ ఛార్టర్ పెడతామన్నారు. ప్రభుత్వం నుంచి అనుమతులు రాగానే జేఎల్ఎం, సబ్ ఇంజినీర్, అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టుల నియామకాలు  చేపడతామని పేర్కొన్నారు. పరిహారం కూడా వెంటనే మంజూరయ్యేలా చూస్తామన్నారు. లూజ్ లైన్లు, ట్రాన్స్​ ఫార్మర్ల గద్దెల ఎత్తు పెంచుతామని తెలిపారు.  దశల వారీగా పనులు జరుగుతున్నాయని ఆరేడు నెలల్లో అన్నీ పూర్తి చేస్తామని చెప్పారు. 

మీటర్లు ఇవ్వకుండా పెనాల్టీనా?

సాగుకు ఉచిత కరెంట్​ఇస్తున్నరు. కానీ, వ్యవసాయంలో భాగమైన పశు సంపద కోసం వేసుకునే షెడ్లకు మీటర్ కనెక్షన్​ఇవ్వడం లేదు. మీటర్లు ఇవ్వకుండా పెనాల్టీ కట్టమంటే రైతులు ఎలా కడ్తరు?  పశువుల షెడ్లకు కూడా ఉచిత కరెంట్ ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. సంజీవ్​రెడ్డి, రైతు

పరిహారం ఇస్తలేరు

విద్యుత్​ప్రమాదాల్లో చనిపోయినవారి కుటుంబాలకు పరిహారం ఇస్తలేరు. కరీంనగర్ జిల్లా ఈదులగట్టెపల్లిలో షార్ట్​సర్క్యూట్​జరిగి, ఇల్లు కాలడంతో ఏడేండ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. గత అక్టోబర్​లోనే ఈ ఘటన జరిగినా ఇంతవరకు బాధిత కుటుంబానికి పరిహారం అందలేదు. ఇప్పటికైనా ఆదుకోవాలి.జె.సంపత్​రావు, రైతు