
రంగనాయక సాగర్ నుంచి నీరివ్వాలని అంకంపేట, సీతారాంపల్లి రైతులు డిమాండ్
సిద్దిపేట రూరల్, వెలుగు : సాగు నీరు అందకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని, ఆఫీసర్లు స్పందించి తమ గ్రామ చెరువులోకి నీటిని విడుదల చేయాలని సిద్దిపేట రూరల్ మండలం అంకంపేట, సీతారాంపల్లి గ్రామాల రైతులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం లక్ష్మీదేవిపల్లి గ్రామ శివారులోని సిద్దిపేట –హుస్నాబాద్ రహదారిపై ధర్నా చేపట్టారు.
ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ రంగనాయక ప్రాజెక్ట్ నుంచి ప్రభుత్వం నీటిని విడుదల చేసి నెల రోజులు గడుస్తున్నా ఇప్పటివరకు అంకంపేట చెరువులోకి చుక్క నీళ్లు రాలేదన్నారు. ఈ విషయాన్ని గతంలో పలుమార్లు ఇరిగేషన్ ఆఫీసర్లకు చెప్పినా పట్టించుకోలేదన్నారు. సాగు నీరు అందకపోవడంతో పొలాలు పూర్తిగా ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ధర్నా విషయం తెలుసుకున్న రూరల్ సీఐ శ్రీను, ఎస్సై అపూర్వరెడ్డి ఘటనాస్థలానికి చేరుకొని రైతులకు నచ్చజెప్పడంతో ధర్నా విరమించారు.