గుడ్ న్యూస్ : రెండెకరాల వరకు రైతు భరోసా జమ..రైతుల ఖాతాల్లోకి రూ.1,091 కోట్లు

గుడ్ న్యూస్ : రెండెకరాల వరకు  రైతు భరోసా జమ..రైతుల ఖాతాల్లోకి  రూ.1,091 కోట్లు
  • ఇప్పటిదాకా 2,218.49 కోట్లు డిపాజిట్ 
  • సగం రుణమాఫీ చేసి.. మాపై విమర్శలా?: మంత్రి తుమ్మల    

హైదరాబాద్, వెలుగు : రాష్ట్రవ్యాప్తంగా రెండెకరాల వరకూ రైతు భరోసా నిధులు రైతుల ఖాతాల్లో జమ అయ్యాయి. సోమవారం రూ.1,091.95 కోట్లను రైతుల ఖాతాల్లో ప్రభుత్వం డిపాజిట్ చేసింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 34.69 లక్షల మంది రైతులకు రైతు భరోసా కింద రూ 2,218.49 కోట్ల నిధులు జమ చేసినట్లయింది. ఇప్పటిదాకా మొత్తం 36.97 లక్షల ఎకరాలకు రైతు భరోసా పెట్టుబడి సాయం రైతులకు చేరింది. కాగా, రైతుల సంక్షేమం కోసం ఏడాది కాలంలో రూ. 55,256 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేసిందని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు ఒక ప్రకటనలో తెలిపారు. 

దేశంలోని ఏ రాష్ట్రంలోనూ రైతుల కోసం ఒకే ఏడాదిలో ఇంత పెద్ద మొత్తం ఖర్చు పెట్ట లేదన్నారు. కాంగ్రెస్ సర్కార్ ది పావలా రుణమాఫీ అని విమర్శిస్తున్న నాయకులు.. బీఆర్ఎస్ హయాంలో 2018లో రుణమాఫీ మొదలుపెట్టి ఎంత మందికి వేశారో చెప్పాలన్నారు. ఎన్నికల్లో లబ్ధి కోసమే 2023లో ఆఖరి టైమ్​లో సగం మందికే రుణమాఫీ చేసినవారు తమను విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. 2014లో రుణమాఫీతో రైతులపై రూ.2,630 కోట్ల వడ్డీ భారం పడిందని, 2018 రుణమాఫీలోనూ నాలుగేండ్ల జాప్యంతో రూ.8,315 కోట్ల వడ్డీ భారం రైతులపై వేశారన్నారు. 

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మొదటి పంట కాలంలోనే 25,35,964 మంది రైతులకు రూ.20,616.89 కోట్ల రుణమాఫీ చేశామన్నారు. పంటల బీమాతో పాటు అన్ని పథకాలనూ ఆపేయడంతో రైతులు రూ.3 వేల కోట్లు నష్టపోయారని విమర్శించారు.