చలివాగు ప్రాజెక్ట్ నీళ్లను తీసుకెళ్లనివ్వం...ఇరిగేషన్​ ఆఫీసర్లను అడ్డుకున్న స్థానిక రైతులు

చలివాగు ప్రాజెక్ట్  నీళ్లను తీసుకెళ్లనివ్వం...ఇరిగేషన్​ ఆఫీసర్లను అడ్డుకున్న స్థానిక రైతులు
  • దేవాదుల పంప్​హౌస్​ వద్ద బైఠాయించి ధర్నా 

శాయంపేట, వెలుగు:  చలివాగు ప్రాజెక్ట్ లోని నీటిని స్థానిక పంటలకు ఇవ్వకుండా తీసుకెళ్తే ఊరుకోబోమని ఇరిగేషన్​ ఆఫీసర్లను రైతులు నిలదీశారు. దేవాదుల పంప్​హౌస్​ గేట్‌ లోపలే ఉంచి లాక్ వేసి బైఠాయించి నినాదాలు చేశారు. వివరాల్లోకెళ్తే.. ఇరిగేషన్​ ఇంజనీరింగ్ ​చీఫ్​ అనిల్​కుమార్‌‌రెడ్డి, అడ్వైజర్​ పెంటారెడ్డి, వరంగల్, హనుమకొండ జిల్లాల సీఈలు అనిల్​కుమార్​రెడ్డి, అశోక్​కుమార్​, ఎస్​సీ వెంకటేశ్వర్లు, మెహన్​రావు, ఈఈలు ప్రసాద్, సునీతతో పాటు డీఈ, ఏఈలు బుధవారం హనుమకొండ జిల్లా శాయంపేట మండలం జోగంపల్లి వద్ద చలివాగు ప్రాజెక్టులో నీటి నిల్వలు తగ్గడంపై ఆరా తీసేందుకు వెళ్లారు.

ప్రాజెక్టు జాలు తూము తెరిచి ఉండడంపై స్థానిక ఆఫీసర్లపై ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే తూమును మూసి వేయాలని, లేదంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దీంతో చలివాగు ప్రాజెక్టు ఆయకట్టు  రైతులు వెళ్లగా.. అప్పటికే ప్రాజెక్టు నీటిని దేవాదుల పంపుల ద్వారా ధర్మసాగర్​కు పంపింగ్​చేస్తుండడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చలివాగులో 15 ఫీట్ల మేర నీటిని ఉంచిన తర్వాతే ధర్మసాగర్‌‌కు పంపింగ్​చేసుకోవాలని కోరారు.  

వారంపాటు నీటి పంపింగ్​ఆపివేస్తే తమ పంటలు చేతికొస్తాయని పేర్కొన్నారు. అయితే.. ధర్మసాగర్ లో తాగునీటికి ఇబ్బందులు పడుతున్నారని అధికారులు చెప్పారు.  దీంతో ప్రాజెక్టులో 15 ఫీట్లు కంటే తక్కువ ఉన్నప్పుడు నీటిని తరలిస్తే ఊరుకునేది లేదని రైతులు మండిపడ్డారు. ఆఫీసర్లు వినకపోవడంతో పంప్​హౌస్​నుంచి బయటికు వెళ్లకుండా గేట్​కు తాళం వేశారు.  సుమారు గంటపాటు పంప్​హౌస్​వద్దనే బైఠాయించారు. దీంతో ఆఫీసర్లు నాలుగు రోజులపాటు నీటి పంపింగ్​ నిలిపివేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు.