
జనగామ, వెలుగు : ఎండ తీవ్రత పెరగడంతో పంటలు ఎండిపోతున్నాయని, దేవాదుల నీటిని విడుదల చేసి ఆదుకోవాలని కోరుతూ పలువురు రైతులు గురువారం జనగామ కలెక్టరేట్ ఎదుట ధర్నాకు దిగారు. బొమ్మకూరు రిజర్వాయర్ ఆయకట్టు పరిధిలోని గానుగుపహాడ్, ఎర్రకుంట తండా, గోపరాజుపల్లి, పెద్దపహాడ్, వడ్లకొండ గ్రామాలకు చెందిన ముందుగా జనగామలోని దేవాదుల క్వార్టర్స్లో ఉన్న ఇరిగేషన్ ఆఫీస్ ముందు ధర్నాకు దిగారు.
సుమారు గంట పాటు ఆందోళన చేసినా ఎవరూ పట్టించుకోకపోవడంతో ఆగ్రహించిన రైతులు, అక్కడి నుంచి ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి క్యాంప్ వద్దకు చేరుకొని సమస్యను వివరించారు. దీంతో నీటి విడుదలకు తన వంతు ప్రయత్నం చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. అనంతరం రైతులు కలెక్టరేట్ వద్దకు చేరుకొని ధర్నా చేపట్టారు. ఇప్పటికే సుమారు 300 ఎకరాలకు పైగా పంట దెబ్బతిందని, ఆఫీసర్లకు ఎన్ని సార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదన్నారు. బొమ్మకూరు రిజర్వాయర్ నుంచి నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
విషయం తెలుసుకున్న జనగామ టౌన్ సీఐ దామోదర్రెడ్డి, ఎస్సైలు రాజేశ్కుమార్ చెన్నకేశవులు కలెక్టరేట్ వద్దకు చేరుకొని రైతులతో మాట్లాడారు. అనంతరం ఇరిగేషన్ ఈఈ మంగీలాల్ వచ్చి మూడు, నాలుగు రోజుల్లో నీటిని విడుదల చేసేలా చర్యలు తీసుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. కార్యక్రమంలో మాజీసర్పంచ్ బొల్లం శారద, శానబోయిన శ్రీనివాస్, బేజాడి సిద్దులు, కొర్ర శంకర్ పాల్గొన్నారు.