రైతులకు సమర్థవంతంగా సేవలు అందించాలి: మంత్రి తుమ్మల

రైతులకు సమర్థవంతంగా సేవలు అందించాలి: మంత్రి తుమ్మల

హైదరాబాద్, వెలుగు: వ్యవసాయ అనుబంధ సంస్థలు రైతులకు సమర్థవంతంగా సేవలు అందించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. అగ్రి కార్పొరేషన్లను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందని మంత్రి తెలిపారు. సోమవారం సెక్రటేరియెట్‎లో ఆగ్రోస్, హాకా,  టీజీఆర్ఐసీ, వేర్​హౌసింగ్ కార్పొరేషన్లపై మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడారు. ప్రభుత్వ అనుబంధ సంస్థలు రైతులకు  సమర్థవంతంగా సేవలు అందించాలని ఆదేశించారు.

హాకాఎండీ చంద్రశేఖర్​రెడ్డి మాట్లాడుతూ.. సంస్థను బలోపేతం చేసే దిశగా ఈ ఆర్థిక సంవత్సరంలో చేపట్టే కార్యక్రమాలను వివరించారు. రూరల్ ఇరిగేషన్ కో ఆపరేటివ్ సొసైటీలో దశాబ్ద కాలంగా ఆడిట్ జరగలేదని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం తుమ్మల మాట్లాడుతూ..ఇప్పటికే నమోదైన ఫార్మర్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్​(ఎఫ్ పీఓ)లకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఆగ్రోస్ సంస్థ గత ఏడాదిగా నిర్వహించిన కార్యక్రమాలను సంస్థ ఎండీ రాములు వివరించారు. 

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఆగ్రోస్ ద్వారా వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని ముందుకు తీసుకెళ్లే అవకాశాలను పరిశీలించాలని ఆదేశించారు. ఒకే కార్యకలాపాలను నిర్వహించే సంస్థలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఈ సమీక్షలో వేర్​ హౌసింగ్​ కార్పొరేషన్ చైర్మన్ రాయల నాగేశ్వర రావు, అగ్రికల్చర్​ సెక్రటరీ రఘునందన్ రావు, హాకా ఎండీ చంద్రశేఖర్​రెడ్డి,  వేర్​హౌసింగ్​ఎండీ డాక్టర్​కె. లక్ష్మి, అగ్రోస్​ ఎండీ కె.రాములు, అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు.