
బషీర్ బాగ్, వెలుగు : లైఫ్ లో సెటిల్ అయ్యేందుకు ఓ ఉద్యోగి పని చేసే సంస్థలో తన తండ్రితో కలిసి చోరీకి పాల్పడ్డాడు. నిందితులను నారాయణగూడ పోలీసులు అరెస్ట్ చేశారు. నారాయణగూడ పీఎస్ లో బుధవారం ఏసీపీ శంకర్ మీడియాకు వివరాలు తెలిపారు. గత నెల 22న రేడియంట్ క్యాష్ మేనేజ్ మెంట్ సర్వీస్ డబ్బులు తరలించే వెహికల్ లో రూ. 5.90 లక్షలు మిస్సింగ్ అయినట్లు సంస్థ శాలిబండ బ్రాంచ్ హెడ్ పిల్లి రామకృష్ణమూర్తి నారాయణగూడ పోలీసులకు కంప్లయిట్ చేశాడు.
హిమాయత్ నగర్ లోని మలబార్ గోల్డ్ షాప్ లో డబ్బులను తీసుకొనేందుకు సంస్థ ఉద్యోగులు పవన్ కుమార్, నిఖిల్ వెళ్లిన వెహికల్ లో డబ్బులు చోరీ అయినట్టు పేర్కొన్నారు. డబ్బులు పోయిన తర్వాత వెహికల్ డ్రైవర్ మహ్మద్ రహీం పాషా డ్యూటీకి రావడంలేదని కంప్లయింట్ లో వివరించారు. కేసు నమోదు చేసి డ్రైవర్ పై నిఘా పెట్టిన పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకుని విచారించారు.
హిమాయత్ నగర్ లో వెహికల్ లోంచి నగదు 5 .90 లక్షల నగదును తీసి తండ్రి మహ్మద్ యాకుబ్ కు ఇచ్చినట్టు డ్రైవర్ ఒప్పుకున్నాడు. రహీం పాషాతో పాటు అతడి తండ్రిని అరెస్ట్ చేశారు. వారి వద్ద రూ. 5.30 వేలు రికవరీ చేసి సీజ్ చేశారు. నిందితులను రిమాండ్ కు తరలించినట్లు ఏసీపీ శంకర్ తెలిపారు. ఇన్ స్పెక్టర్ చంద్రశేఖర్, డీఎస్ఐ వెంకటేష్ , సిబ్బందిని ఏసీపీ అభినందించారు.