
తెల్లారితే కొడుకు పెళ్లి.. బంధువులతో ఇళ్లంతా సందడిసందడి నెలకొంది. ఇంట్లో శుభకార్యం కావడంతో కుటుంబ సభ్యులంతా పెళ్లి ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఇంతలోనే అర్థరాత్రి పెళ్లి కొడుకు తండ్రి గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. మంగళవాయిద్యాలతో కలకలలాడాల్సిన ఇళ్లు.. తండ్రి మృతితో ఒక్కసారిగా శోకసంద్రంలో మునిగిపోయింది. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది.
రామక్కపేట గ్రామానికి చెందిన రాగుల సత్యనారాయణ గౌడ్ ఇటీవల తన పెద్ద కుమారుడు శ్రీనివాస్ కు రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావు పెట మండలం కొత్త పల్లి గ్రామానికి చెంది భావన అనే అమ్మాయితో వివాహం కుదిరింది. ఫిబ్రవరి 23న ఉదయం దుబ్బాక లోని ఓ ఫంక్షన్ హల్ లో వివాహం జరగాల్సి ఉంది. శ్రీనివాస్ తండ్రి సత్యనారాయణ గౌడ్ అర్ధరాత్రి గుండెపోటుతో మృతి చెందడంతో ఇరు కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. సత్యనారాయణ గత కొంత కాలంగా సిద్దిపేటలో నివాసం ఉంటున్నాడు. తన గృహంలో అర్ధరాత్రి గుండెపోటుతో మృతి చెందాడు.