
వాషింగ్టన్: భార్యను చంపి తప్పించుకు తిరుగుతున్న భారత సంతతి వ్యక్తి కోసం అమెరికా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్బీఐ) గాలిస్తోంది. అంతేకాకుండా అతన్ని పట్టించిన వారికి రూ.2.1 కోట్ల భారీ రివార్డ్ను ప్రకటించింది. భద్రేశ్ కుమార్ చేతన్ భాయ్ పటేల్, అతని భార్య పాలక్ అమెరికాలో మేరిల్యాండ్లోని హనోవర్లో డోనట్ షాపులో పనిచేసేవారు. 2015 ఏప్రిల్ 12న అర్ధరాత్రి దాటిన తర్వాత భద్రేశ్.. కిచెన్లో పనిచేస్తున్న అతని భార్య పాలక్ను కత్తితో పలుమార్లు పొడవగా, ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటన అక్కడున్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది. భార్యను హత్య చేసిన తర్వాత భద్రేశ్ అక్కడి నుంచి పారిపోయాడు. అప్పటి నుంచి అతని కోసం అమెరికా పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.