
న్యూఢిల్లీ: కిందటేడాది అక్టోబర్– డిసెంబర్ క్వార్టర్ (క్యూ3) లో ఇండియాలోకి 10.9 బిలియన్ డాలర్ల ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ (ఎఫ్డీఐలు) వచ్చాయి. అంతకుముందు ఏడాది ఇదే టైమ్ పీరియడ్లో వచ్చిన 11.55 బిలియన్ డాలర్లతో పోలిస్తే 5.6 శాతం తగ్గాయి. గ్లోబల్ ఎకానమీ అధ్వాన్నంగా మారడమే ఇందుకు కారణం. ప్రభుత్వ డేటా ప్రకారం, కిందటేడాది జులై–సెప్టెంబర్ క్వార్టర్లో వచ్చిన ఎఫ్డీఐలు ఏడాది లెక్కన 43శాతం పెరిగి 13.6 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. అదే ఏప్రిల్–జూన్ క్వార్టర్లో 16.17 బిలియన్ డాలర్లు వచ్చాయి.
మొత్తంగా కిందటేడాది ఏప్రిల్– డిసెంబర్ మధ్య ఇండియాలోకి 40.67 బిలియన్ డాలర్ల ఎఫ్డీఐలు వచ్చాయి. అంతకుముందు ఏడాది ఇదే టైమ్లో వచ్చిన 32 బిలియన్ డాలర్లతో పోలిస్తే 27 శాతం గ్రోత్ నమోదైంది. సింగపూర్, యూఎస్, నెదర్లాండ్స్, యూఏఈ, కేమన్ ఐలాండ్స్, సిప్రస్ నుంచి ఎక్కువగా ఎఫ్డీఐలు వచ్చాయి. మారిషస్, జపాన్, యూకే, జర్మనీ నుంచి తగ్గాయి. సర్వీసెస్, కంప్యూటర్ సాఫ్ట్వేర్, హార్డ్వేర్, ట్రేడింగ్, టెలికమ్యూనికేషన్, ఆటోమొబైల్, కెమికల్స్ సెక్టార్లలోకి ఎఫ్డీఐలు పెరిగాయి.