ఫెలోషిప్​, అసిస్టెంట్​ ప్రొఫెసర్​కు యూజీసీ- నెట్‌‌

ఫెలోషిప్​, అసిస్టెంట్​ ప్రొఫెసర్​కు యూజీసీ- నెట్‌‌

యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ డిసెంబర్‌‌ 2023 (యూజీసీ- నెట్‌‌) పరీక్ష షెడ్యూల్‌‌ విడుదలైంది. జూనియర్‌‌ రీసెర్చి ఫెలోషిప్‌‌, విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్‌‌ ప్రొఫెసర్‌‌ పోస్టులకు పోటీపడేందుకు ఉపయోగపడే ఈ పరీక్షను జూన్‌‌లో నిర్వహించనున్నట్టు యూజీసీ వెల్లడించింది. మొత్తం 83 సబ్జెక్టులకు నిర్వహించే కంప్యూటర్‌‌ ఆధారిత పరీక్ష నిర్వహణ బాధ్యతను జాతీయ పరీక్షల మండలికి అప్పగించింది. ఆన్‌‌లైన్‌‌లో సెప్టెంబర్‌‌ 30 నుంచి అక్టోబర్‌‌ 28 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు.

ఏటా జూన్, డిసెంబర్ నెలల్లో రెండు సార్లు దీనిని నిర్వహిస్తారు. తాజాగా డిసెంబర్​ సెషన్ నోటిఫికేషన్‌‌ విడుదలైంది. ఇందులో క్వాలిఫై అయితే హ్యూమానిటీస్‍, సైన్స్, సోషల్ సైన్సెస్‍, లాంగ్వేజస్ విభాగాల్లోని 83 సబ్జెక్టుల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్, లెక్చరర్‌‌గా కెరీర్ ప్రారంభించడమే కాక జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్, సీనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ ద్వారా పరిశోధనలు చేసి పీహెచ్‌‌డీ, ఎంఫిల్ చేసే అవకాశం లభిస్తుంది.

నెట్ బెనిఫిట్స్​

నెట్ క్వాలిఫై అయిన అభ్యర్థులు యూనివర్సిటీలు, డిగ్రీ, పీజీ కాలేజీల్లో జూనియర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ లెవెల్‌‌లో కెరీర్ ప్రారంభించవచ్చు. ఈ సమయంలోనే యావరేజ్ శాలరీ సంవత్సరానికి ఆరు లక్షల వరకు ఉంటుంది. ఆ తర్వాత పనితీరు ఆధారంగా అసిస్టెంట్ ప్రొఫెసర్, సీనియర్ అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్ గా ప్రమోషన్లు లభిస్తాయి. ఈ దశలో దాదాపు రూ.15 నుంచి రూ.20 లక్షల వేతనాలు అందుకోవచ్చు. ఫుల్‌‌టైమ్ టీచింగ్ కెరీర్ కాకుండా డిఫరెంట్ గా ఆలోచించేవారు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్, ఆథర్, గెస్ట్ ఫ్యాకల్టీ, కన్సల్టెంట్, ఆన్‌‌లైన్/ఆఫ్‌‌లైన్ ట్యూటర్, ట్రాన్స్‌‌మిషన్ ఎగ్జిక్యూటివ్,  ల్యాబ్ ట్రైనర్ వంటి పోస్టులను ఎంపిక చేసుకోవచ్చు. అయితే వీటిలో అసిస్టెంట్ ప్రొఫెసర్ కి వచ్చినంత వేతనాలు అందకపోవచ్చు. వీటితో పాటు ప్రభుత్వ రంగంలోని మహారత్న, నవరత్న, మినీరత్న కంపెనీలు నెట్ క్వాలిఫైడ్ అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి రిక్రూట్ చేసుకుంటాయి. యూజీసీ కింద పనిచేసే ల్యాబొరేటరీలు, ఇతర ఇండస్ర్టీలు నెట్ క్వాలిఫైడ్ వారిని మాత్రమే నియమించుకుంటున్నాయి. జేఆర్‌‌ఎఫ్ క్వాలిఫై అయినవారు యూనివర్సిటీల్లో మూడేళ్లపాటు జూనియర్ రీసెర్చ్ ఫెలోగా పనిచేయాలి. అనంతరం సీనియర్ రీసెర్చ్ ఫెలోగా ప్రమోషన్ వస్తుంది.

ఎగ్జామ్​ ప్యాటర్న్​: యూజీసీ–నెట్‌‌ పరీక్ష ఆన్‌‌లైన్‌‌ విధానం (కంప్యూటర్‌‌ బేస్డ్‌‌ టెస్ట్‌‌)లో ఆబ్జెక్టివ్‌‌ తరహాలో నిర్వహిస్తారు. మొత్తం మూడు వందల మార్కులకు జరిగే ఈ పరీక్షలో పేపర్‌‌1, పేపర్‌‌ 2 ఉంటాయి. పేపర్‌‌–1కు అసిస్టెంట్‌‌ ప్రొఫెసర్, జూనియర్‌‌ రీసెర్చ్‌‌ ఫెలోషిప్‌‌ అండ్‌‌ అసిస్టెంట్‌‌ ప్రొఫెసర్‌‌ అభ్యర్థులందరూ తప్పనిసరిగా హాజరు కావాలి.

పేపర్‌‌–1లో టీచింగ్‌‌/రీసెర్చ్‌‌ ఆప్టిట్యూడ్‌‌పై 50 ప్రశ్నలు–100 మార్కులు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు రెండు మార్కులు కేటాయించారు.

పేపర్‌‌–2.. అభ్యర్థులు తమ పీజీ స్పెషలైజేషన్‌‌ ఆధారంగా ఎంచుకున్న సబ్జెక్టుకు సంబంధించిన పరీక్ష ఉంటుంది.  పేపర్‌‌–2లో సంబంధిత సబ్జెక్ట్‌‌ పేపర్‌‌ నుంచి 100 ప్రశ్నలు–200 మార్కులకు ఉంటాయి.

సిలబస్​

పేపర్‍-1

ఇందులో అభ్యర్థుల టీచింగ్ అండ్ రీసెర్చ్ ఆప్టిట్యూడ్‍ను పరీక్షించే విధంగా ప్రశ్నలు అడుగుతారు. అంతేకాకుండా కాంప్రహెన్సన్‍, అనాలసిస్‍, ఎవల్యూషన్‍, జనరల్ అవేర్‍నెస్ ఆన్ టీచింగ్ అండ్ లెర్నింగ్ ఇన్ హయ్యర్ ఎడ్యుకేషన్, ఇంటరాక్షన్ బిట్వీన్ పీపుల్‍, న్యాచురల్ రీసోర్సెస్ అండ్ ఇంపాక్ట్ ఆఫ్ లైఫ్ అనే అంశాలపై అవగాహనను టెస్ట్ చేసేలా క్వశ్చన్స్ వస్తాయి. సిలబస్‍లో మొత్తం పది యూనిట్లు ఉండగా ఒక్కో యూనిట్ నుంచి 5 ప్రశ్నలు ఇస్తారు.

పేపర్-2

ఈ పేపర్‍లో 101 సబ్జెక్టులున్నాయి. అభ్యర్థి ఎంచుకున్న సబ్జెక్టు నుండి పీజీ స్థాయిలో ప్రశ్నలు అడుగుతారు. ప్రశ్నలన్నీ అప్లికేషన్ ఓరియంటెడ్‍గా ఉంటాయి కాబట్టి సెలెక్టెడ్ సబ్జెక్టులో ఇంటర్ నుంచి పీజీ వరకు ఎన్‍సీఈఆర్‍టీ, యూనివర్సిటీ పుస్తకాలు, ఇతర నిపుణులు రాసిన బుక్స్ చదవడం వల్ల మంచి మార్కులు పొందొచ్చు. ముఖ్యంగా పాత ప్రశ్న పత్రాల్లోని ప్రశ్నలను విశ్లేషించుకొని ప్రతి ప్రశ్నను క్షుణ్నంగా అధ్యయనం చేయాలి.  యూజీసీ నెట్ వెబ్ సైట్‌‌లో దాదాపు పదేళ్లకు పైగా ప్రీవియస్ పేపర్లు, సబ్జెక్టుల వారీ సిలబస్, కటాఫ్ స్కోర్స్ వంటివి అందుబాటులో ఉన్నాయి. వాటిని బాగా ప్రాక్టీస్ చేస్తే పేపర్-2 లో అధిక మార్కులు పొందవచ్చు.

రెండు కేటగిరీలు: యూజీసీ–నెట్‌‌ను రెండు కేటగిరీలుగా వర్గీకరించారు. అవి.. అసిస్టెంట్‌‌ ప్రొఫెసర్, జూనియర్‌‌ రీసెర్చ్‌‌ ఫెలోషిప్‌‌ అండ్‌‌ అసిస్టెంట్‌‌ ప్రొఫెసర్‌‌. దరఖాస్తు సమయంలోనే అభ్యర్థులు తాము ఏ కేటగిరీ పరీక్షకు హాజరవ్వాలనుకుంటున్నారో స్పష్టం చేయాలి. ఉదాహరణకు.. పరిశోధన అభ్యర్థులు.. జూనియర్‌‌ రీసెర్చ్‌‌ ఫెలోషిప్‌‌ అండ్‌‌ అసిస్టెంట్‌‌ ప్రొఫెసర్‌‌ ప్రాథమ్యాన్ని సెలెక్ట్​ చేసుకోవాలి. అసిస్టెంట్‌‌ ప్రొఫెసర్‌‌ కేటగిరీ మాత్రమే కోరుకుంటే.. అసిస్టెంట్‌‌ ప్రొఫెసర్‌‌ ప్రాథమ్యాన్ని ఎంపిక చేసుకుంటే సరిపోతుంది.

అర్హత సాధిస్తే:  జాతీయ అర్హత పరీక్ష (నెట్‌‌)లో నెగ్గితే దేశవ్యాప్తంగా అన్ని యూనివర్సిటీలు, విద్యా సంస్థల్లో అసిస్టెంట్‌‌ ప్రొఫెసర్‌‌ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. జేఆర్‌‌ఎఫ్‌‌ అర్హులు మేటి సంస్థల్లో పరిశోధన (పీహెచ్‌‌డీ) దిశగా అడుగులేయవచ్చు. వీరికి మొదటి రెండేళ్లలో ప్రతి నెలా  రూ.31,000 చెల్లిస్తారు. అనంతరం ఎస్‌‌ఆర్‌‌ఎఫ్‌‌కు అర్హత సాధిస్తే రూ.35,000 చొప్పున స్టైపెండ్‌‌ అందుతుంది. ఇటీవలి కాలంలో కొన్ని ప్రభుత్వ రంగ సంస్థలు నెట్‌‌ స్కోర్‌‌తో మేనేజ్‌‌మెంట్‌‌ ట్రెయినీ హోదాతో లీగల్‌‌, హ్యూమన్‌‌ రిసోర్సెస్‌‌, మార్కెటింగ్‌‌ విభాగాల్లో ఉద్యోగాలు అందిస్తున్నాయి. ప్రైవేటు సంస్థలు సైతం నెట్‌‌ అర్హులకు ఉద్యోగాల్లో ప్రాధాన్యం కల్పిస్తున్నాయి.

కటాఫ్‌‌:  సబ్జెక్టు బట్టి కటాఫ్​ మారుతుంది. ఆ సబ్జెక్టులో పరీక్ష రాసినవారి సంఖ్య, ప్రశ్నపత్ర కఠినత్వం ప్రకారం ఈ మార్పులు ఉంటాయి. లెక్చరర్‌‌షిప్‌‌ అయితే ఏ సబ్జెక్టు అయినప్పటికీ అన్‌‌ రిజర్వ్‌‌డ్‌‌ అభ్యర్థులు 200 మార్కులు పొందితే సరిపోతుంది. అదే జేఆర్‌‌ఎఫ్‌‌ కోసమైతే 220 వరకు రావాలి. కొన్ని సబ్జెక్టుల్లో లెక్చరర్‌‌షిప్‌‌ 180 మార్కులకీ పొందవచ్చు. జేఆర్‌‌ఎఫ్‌‌ 200కి లభిస్తోంది.

ప్రిపరేషన్ ప్లాన్​:  అభ్యర్థులకు సబ్జెక్టు మీద ఎంత పట్టుందో తెలుసుకునేలా ప్రశ్నలు అడుగుతుండడంతో బేసిక్స్​ మీద పూర్తి అవగాహన కలిగి ఉండాలి. రెండు, మూడు అంశాలను కలిపి ఒకే ప్రశ్నగా రూపొందిస్తారు. ముందు డిగ్రీ పాఠ్యాంశాలను విస్తృతంగా చదవాలి. ఏవైనా చాప్టర్లు అర్థం చేసుకోవడంలో ఇబ్బందిగా అనిపిస్తే వాటిని ఇంటర్మీడియట్‌‌ స్థాయిలో చదువుకోవాలి. చివరకు పీజీ పాఠ్యాంశాల మీద అవగాహన పెంచుకోవాలి. చదువుతున్నప్పుడే ముఖ్యాంశాలను నోట్సు రాసుకోవాలి. ప్రీవియస్​ పేపర్స్​ ప్రాక్టీస్​ చేయాలి. ప్రశ్నలడిగే విధానం, వాటి స్థాయి, అంశాలవారీ లభిస్తోన్న ప్రాధాన్యం పరిశీలించి, సన్నద్ధతలో అవసరమైన మార్పులు చేసుకోవాలి. సన్నద్ధత పూర్తయిన తర్వాత కనీసం పది మాక్‌‌ టెస్టులు రాయాలి. ఇందులో సాధించిన స్కోరు గమనించాలి. ఏ చాప్టర్లు/విభాగాల్లో తప్పులొస్తున్నాయో తెలుసుకుని వాటిని మరింత శ్రద్ధగా చదవాలి. ఇదే పద్ధతిని చివరిదాకా కొనసాగిస్తే అభ్యాసం సరైన దిశగా వెళ్తున్నట్లు భావించవచ్చు. పరీక్షలో విజయవంతం కావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది.

నోటిఫికేషన్​

అర్హత: 55 శాతం మార్కులతో మాస్టర్స్ డిగ్రీ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. వయసు జేఆర్‌‌ఎఫ్‌‌కు 30 ఏళ్లు మించకూడదు. అసిస్టెంట్ ప్రొఫెసర్‌‌కు గరిష్ట వయోపరిమితి లేదు.

దరఖాస్తులు: అర్హులైన అభ్యర్థులు అక్టోబర్ 28 వరకు దరఖాస్తు చేసుకోవాలి. పరీక్షలు డిసెంబర్ 6 నుంచి 22 వరకు నిర్వహించ నున్నారు. వివరాల కోసం www.ugcnet.nta.nic.in వెబ్​సైట్​లో సంప్రదించాలి.

- వెలుగు ఎడ్యుకేషన్​ డెస్క్​