
మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా మీర్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకుంది. నాగోల్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న మహిళా కానిస్టేబుల్ ఆకుల దీపిక హస్తినాపురం టీచర్స్ కాలనీలో తన భర్తతో కలిసి ఉంటుంది. ఏప్రిల్ 21న సాయంత్రం ఎవరూ లేని సమయంలో తన ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి వచ్చిన మీర్ పేట పోలీసులు కానిస్టేబుల్ భర్త రవికుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.
తెలంగాణలో ఇటీవల మహిళా కానిస్టేబుళ్లు వరుసగా ఆత్మహత్యలకు పాల్పడడం కలకలం రేపుతోంది. జీవితంపై విరక్తితో ఏప్రిల్ 19న వరంగల్ జిల్లాలో మహిళా కానిస్టేబుల్ అర్చన ఆత్మహత్య చేసుకుంది. పెళ్లి కావడం లేదని జనగామ జిల్లా కొడకండ్ల మండలానికి చెందిన ఏఆర్ మహిళా కానిస్టేబుల్ నీలిమా ఏప్రిల్ 13న ఆత్మహత్య చేసుకున్నారు. ఫిబ్రవరి 25 యాదాద్రి భువనగిరిలో ఏఆర్ కానిస్టేబుల్ అనూష ఆత్మహత్య చేసుకున్నారు.