
శామీర్ పేట, కీసర వెలుగు: తెలంగాణను అన్ని రంగాల్లో నంబర్ వన్గా నిలపడానికి ప్రతిఒక్కరూ కృషి చేయాలని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతమ్ పిలుపునిచ్చారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా కీసరలోని అమరవీరుల స్తూపం వద్ద ఆదివారం ఆయన నివాళులర్పించారు. అనంతరం కలెక్టరేట్ ప్రాంగణంలో జాతీయ జెండాను ఆవిష్కరించి, పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఎంతోమంది త్యాగదనుల కృషి ఫలితంగా ఏర్పడిన తెలంగాణను అభివృద్ధి బాటలో నడిపేందుకు అందరూ ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో డీసీపీ నిఖిత పంత్, అడిషనల్ కలెక్టర్ అభిషేక్ అగస్త్య, విజేందర్ రెడ్డి, జిల్లా అధికారులు, పోలీస్ సిబ్బంది, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు.
వికారాబాద్: తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరుల త్యాగాలు మరువలేనివని వికారాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి కొనియాడారు. పట్టణంలోని ఆర్అండ్ బీ గెస్ట్ హౌస్ వద్ద అమరవీరుల స్తుపానికి ఎస్పీ కొట్టి రెడ్డితో కలిసి ఆయన నివాళులర్పించారు. అనంతరం కలెక్టరేట్ లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. ఉత్సాహభరిత వాతావరణంలో వేడుకలు నిర్వహించుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్బంగా విద్యార్థులు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు రాహుల్ శర్మ, లింగ్యా నాయక్, ట్రైని కలెక్టర్ ఉమా హారతి, పరిగి ఎమ్మెల్యే రామ్ మోహన్ రెడ్డి, జడ్పీ చైర్ పర్సన్ సునీతా మహేందర్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల రమేశ్, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు, తదితరులు పాల్గొన్నారు.
కొడంగల్: కొడంగల్ పట్టణంలోని ముఖ్మమంత్రి రేవంత్రెడ్డి నివాసంలో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు నందారం ప్రశాంత్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయంలో స్పెషల్ఆఫీసర్ వెంకట్రెడ్డి, తహసీల్దార్ కార్యాలయంలో ఎంఆర్వో విజయ్కుమార్, మున్సిపాలటీలో కమీషనర్ బలరాం నాయక్ జాతీయ జెండాలను ఎగరవేశారు.