యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి కొలువై ఉన్న యాదగిరిగుట్ట చుట్టూ ప్రముఖ సినీ దర్శకుడు, రాజ్యసభ సభ్యుడు విజయేంద్రప్రసాద్ గిరిప్రదక్షిణ చేశారు. స్వామివారి దర్శనం కోసం మంగళవారం రాత్రి యాదగిరిగుట్టకు వచ్చిన ఆయన.. మొదట కొండ చుట్టూ రెండున్నర కిలోమీటర్లు కాలినడకన గిరిప్రదక్షిణ చేశారు. అనంతరం కొండపైకి చేరుకుని గర్భగుడిలో స్వయంభూ నారసింహుడిని దర్శించుకున్నారు.
ఆలయానికి వచ్చిన ఆయనకు అర్చకులు స్వాగతం పలికి దర్శనం కల్పించారు. అనంతరం ఆశీర్వచన మండపంలో అర్చకులు ఆయనకు వేదాశీర్వచనం చేయగా.. ఆలయ ఈవో భాస్కర్ రావు లడ్డూప్రసాదం, స్వామివారి శేషవస్త్రాలు అందజేశారు.