
తెలుగు రాష్ట్రాల్లో గత కొంత కాలంగా సంచలనంగా మారిన అఘోరీని పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. నగ్నపూజల పేరుతో 10 లక్షల రూపాయలు కాజేసిందని ఒక మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అరెస్టు చేశారు పోలీసులు. మంగళవారం (ఏప్రిల్ 22) ఉత్తరప్రదేశ్ లో అఘోరీ అలియాస్ శ్రీనివాస్ ను అదుపులోకి తీసుకున్నారు మోకిలా పోలీసులు. అక్కడి నుంచి నేరుగా నార్సింగి స్టేషన్ కు తరలించారు.
మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అఘోరీని రెండు గంటల పాటు విచారించారు పోలీసులు. విచారణ అనంతరం చేవెళ్ల కోర్టులో హాజరు పరిచేందుకు తీసుకెళ్లారు. ఆ తర్వాత రిమాండుకు పంపించే అవకాశం ఉంది.
నేను జైలుకు వెళ్లినా వర్షిణి నాతోనే ఉంటుంది: మీడియాతో అఘోరీ
పోలీసుల అదుపులో ఉన్న అఘోరీ మీడియాతో మాట్లాడింది. ప్రస్తుతం కేసు కోర్టులో ఉన్నందున ఎక్కువ విషయాలు మాట్లాడలేనని చెప్పింది. చట్టం తన పని తాను చేసుకొని పోతుందని, పోలీసులకు సహకరిస్తానని తెలిపింది. వర్షిణి తన భార్య అని.. తనతోనే ఉంటుందని ఈ సందర్భంగా చెప్పింది. ‘‘వర్షిణి నా భార్య. నాతోనే ఉంటుంది. నేను జైలుకు వెళ్లినా నాతో పాటే ఉంటుంది.’’ అని తెలిపింది అఘోరీ.