
- ఏప్రిల్ 1 నుంచి ఇచ్చేందుకు ఏర్పాట్లు
- ఉమ్మడి జిల్లాలో 21,83,215 మందికి లబ్ధి
- ప్రతి నెలా 12,893 మెట్రిక్ టన్నుల బియ్యం అవసరం
- ఇప్పటికే రేషన్ షాపుల్లో బియ్యం నిల్వలు
కామారెడ్డి, నిజామాబాద్, వెలుగు : ఏప్రిల్ 1 నుంచి రేషన్ షాపుల్లో సన్న బియ్యం పంపిణీకి ఉమ్మడి జిల్లాయంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. ఉగాదికి సీఎం రేవంత్రెడ్డి లాంఛనంగా ప్రారంభించనున్నారు. అధికారులు ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి రేషన్ షాపులకు బియ్యాన్ని తరలించి రెడీగా ఉంచారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా గోడౌన్లలో సన్న బియ్యాన్ని నిల్వ చేశారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 21,83, 215 మంది లబ్ధిదారులకు సన్న బియ్యం అందనున్నాయి.
ఒక్కో లబ్ధిదారుడికి 6 కిలోల చొప్పున పంపిణీ చేయనున్నారు. కామారెడ్డి జిల్లాలో 2,53,655 కార్డులు ఉండగా, 8,54,529 మంది లబ్ధిదారులు ఉన్నారు. వీరికి ప్రతి నెలా 5,442 మెట్రిక్ టన్నుల బియ్యం అవసరం ఉంటుంది. నిజామాబాద్ జిల్లాలో 4,03,025 కార్డులు ఉండగా, 12,83,215 మంది లబ్ధిదారులు ఉన్నారు. వీరికి ప్రతి నెలా 7,451 మెట్రిక్ టన్నుల బియ్యం అవసరమవుతుంది.
రెండు జిల్లాలకు కలిపి ప్రతి నెలా 12,893 మెట్రిక్ టన్నుల బియ్యం సరఫరా చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వం ఇప్పటి వరకు దొడ్డు బియ్యం సరఫరా చేయగా, అధిక శాతం కార్డుదారులు వండుకోకుండా అమ్ముకోవడంతో సర్కార్బియ్యం పక్కదారి పట్టిన విషయం తెలిసిందే. ప్రజాభిప్రాయాన్ని గౌరవించిన కాంగ్రెస్ ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ చేయాలని నిర్ణయించింది.
ఇందుకు గాను సన్నాల సాగును ప్రొత్సహిస్తూ రూ.500 బోనస్ చెల్లిస్తోంది. ఉమ్మడి జిల్లాలో సన్నాల సాగు విస్తీర్ణం గతంలో కంటే పెరిగింది. కామారెడ్డి జిల్లాలో గత వానకాలం సీజన్లో ప్రభుత్వం లక్ష మెట్రిక్ టన్నుల సన్న వడ్లను కొనుగోలు చేసింది. మిల్లర్లు 60 వేల మెట్రిక్ టన్నుల సన్న బియ్యం ఇవ్వాల్సి ఉంది. ఇప్పటికే బియ్యం మర పట్టించి గోడౌన్లలో నిల్వ చేశారు. స్కూల్స్లో మధ్యాహ్న భోజనం, హాస్టల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్లో విద్యార్థుల భోజనం కోసం 550 నుంచి 600 టన్నుల వరకు అవసరమవుతున్నది.
రేషన్ షాపులకు సన్న బియ్యం..
ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి రేషన్ షాపులకు సన్న బియ్యం సప్లయ్ చేయటం గత 4 రోజులుగా సాగుతోంది. కామారెడ్డి జిల్లాలో 578 రేషన్ షాపులు ఉండగా, ఇప్పటికే సగం షాపులకు సన్న బియ్యం చేరాయి. మిగతా షాపులకు 2 రోజుల్లో పంపనున్నారు. నిజామాబాద్ జిల్లాలో 759 రేషన్ షాపులకూ సన్న బియ్యాన్ని తరలించారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో షాపులకు సన్నబియ్యం సప్లయ్ చేసినట్లు కామారెడ్డి డీఎం రాజేందర్, డీఎస్వో మల్లికార్జున్ పేర్కొన్నారు.