హాస్టల్‏లో అగ్ని ప్రమాదం.. 17 మంది విద్యార్థులు సజీవ దహనం

హాస్టల్‏లో అగ్ని ప్రమాదం.. 17 మంది  విద్యార్థులు సజీవ దహనం

నైరోబీ: కెన్యాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ స్కూల్‪‫కు చెందిన హాస్టల్‎లో అగ్నిప్రమాదం సంభవించి 17 మంది స్టూడెంట్లు ‌సజీవ దహనమయ్యారు. మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉందని  పోలీసులు తెలిపారు. నైరీ కౌంటీలోని హిల్‌‌‌‌‌‌‌‌సైడ్ ఎండరాషా ప్రైమరీ స్కూల్లో గురువారం రాత్రి ఈ ఘటన జరిగింది. మృతిచెందిన విద్యార్థుల వయసు 14 ఏండ్ల లోపే ఉంటుంది. 

మంటలు చెలరేగిన డార్మిటరీలో 150 మందికి పైగా బాలురు ఉన్నారు. ఆ బిల్డింగ్ చెక్కతో నిర్మించడంతో మంటలు చాలా వేగంగా వ్యాపించాయని పోలీసులు తెలిపారు. విద్యార్థులు డెడ్​బాడీలు గుర్తుపట్టలేనంతగా కాలిపోవడంతో తమ బిడ్డల జాడ తెలియక తల్లిదండ్రులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ఫైర్ యాక్సిడెంట్కు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.  కాగా, ఈ ఘటనపై కెన్యా అధ్యక్షుడు విలియం రూటో తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.