సూరారంలో భాగ్యనగర్​ గ్యాస్ ​పైప్​ లైన్​ లీక్.. పోలీసుల స్పందనతో తప్పిన ప్రమాదం

సూరారంలో భాగ్యనగర్​ గ్యాస్ ​పైప్​ లైన్​ లీక్.. పోలీసుల స్పందనతో తప్పిన ప్రమాదం
  • భయాందోళనకు గురైన స్థానికులు 

జీడిమెట్ల, వెలుగు: కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని సూరారంలో శనివారం ఉదయం భాగ్యనగర్​వంట గ్యాస్​పైప్​లైన్​లీక్ అయింది. భారీ శబ్ధంతో గ్యాస్​వెలువడడంతో ఆ ప్రాంతమంతా దుమ్ము రేగింది. స్థానికులు భయాందోళనకు గురయ్యారు. స్థానిక మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్​ఎదురుగా నర్సాపూర్​హైవే పక్కన ఓ మహిళ వైభవ్ పేరుతో రెస్టారెంట్ నిర్వహిస్తోంది. రెస్టారెంట్ ముందు ఉన్న చెట్టును కొన్నాళ్ల కింద కొట్టేయగా మోడు మిగిలింది.

నిర్వాహకురాలు శనివారం ఉదయం జేసీబీ సాయంతో చెట్టు మోడును తొలగించే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో భూమిలోని భాగ్యనగర్​వంట గ్యాస్​పైప్​లైన్​కు తగిలి లీకేజీ ఏర్పడింది. ఒక్కసారిగా గ్యాస్​లీకై ఆ ప్రాంతమంతా వ్యాపించింది. స్థానికులు, వాహనదారులు బయపడిపోయారు. సమాచారం అందుకున్న సూరారం సీఐ భరత్​కుమార్, సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని అటు వైపు ఎవరూ రాకుండా చూశారు.

అగ్నిమాపక సిబ్బందిని, భాగ్యనగర్​గ్యాస్​నిర్వాహకులను రప్పించి పైప్​లైన్​కు రిపేర్లు చేయించారు. లీకేజీకి అడ్డుకట్ట వేయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. గ్యాస్​లీకైన టైంలో నిప్పు అంటుకున్నట్లయితే భారీ ప్రమాదం జరిగి ఉండేది.