
బషీర్బాగ్, వెలుగు: నాంపల్లి పటేల్నగర్ లో ఉండే మెకానిక్ నరేందర్ షెడ్డు బుధవారం అగ్నిప్రమాదం జరిగింది. రోజు లాగే రాత్రి నరేందర్ తన షెడ్ లో పనులు ముగించుకొని తాళం వేసి ఇంటికి వెళ్ళిపోయాడు. అర్థరాత్రి తర్వాత షెడ్డు లో నుంచి పొగలు రావడంతో గమనించిన బస్తీవాసులు పోలీసులు , అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు.
వారు ఘటనాస్థలానికి చేరుకొని లోపల కాలిపోతున్న డీజిల్ , పెట్రోల్ బాష్ పంపులు, ఇతర సామగ్రి పైన నీళ్లు కొట్టి మంటలు అదుపులోకి తెచ్చారు. రెండు ఫైరింజన్లతో అగ్ని ప్రమాదాన్ని నిలువరించారు. ఎలాంటి ప్రాణనష్టం జరగక పోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడంతో కేసు నమోదు చేయలేదని, బేగం బజార్ సీఐ విజయ్ కుమార్ తెలిపారు.