
కల్వకుర్తి, వెలుగు: నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో కరెంట్ షార్ట్ సర్క్యూట్ తో రెండు షాపులు పూర్తిగా కాలిపోయాయి. పట్టణంలోని సుభాష్ నగర్ లో ఉన్న అప్నా బజార్, గానుగ నూనె దుకాణం, మొదటి అంతస్తులో ఉన్న కంప్యూటర్ రిపేర్, కంప్యూటర్ స్పేర్ పార్ట్స్ దుకాణం పూర్తిగా దగ్ధం కాగా, రూ.40 లక్షల ఆస్తి నష్టం జరిగింది. అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరగగా, కల్వకుర్తి ఫైర్ స్టేషన్ కు సమాచారం అందించారు. వారు అక్కడికి చేరుకొని ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకురావడంతో భారీ ప్రమాదం తప్పింది.
కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని షాపులను పరిశీలించారు. బాధితులను ఆదుకుంటామని తెలిపారు. బాధితులు రాకేశ్, రాఘవేందర్ దుకాణాల మీదనే ఆధారపడి బతుకుతున్నారు. రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బీచని బాలకృష్ణ రూ.11 వేలు ఆర్యవైశ్య మహాసభ నాయకులకు అందజేశారు. సంస్థ తరపున బాధితులకు ఆర్థికసాయం అందించాలని కోరారు.