
- రాష్ట్రంలోనే మొదటిసారిగా పాలమూరులో ప్రారంభం
మహబూబ్నగర్ కలెక్టరేట్, వెలుగు : ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం రాష్ట్రంలోనే మొదటిసారిగా స్వయం సహాయక సంఘాల మహిళలకు తాపీ పనిలో ట్రైనింగ్ ఇస్తున్నట్లు మహబూబ్నగర్ కలెక్టర్ విజయేందిర బోయి చెప్పారు. డీఆర్డీవో, న్యాక్, హౌసింగ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఆరు రోజుల పాటు జరిగే ట్రైనింగ్ను సోమవారం కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్లు, మండలానికి సుమారు 700 ఇండ్లు కట్టాల్సి ఉందన్నారు.
ఈ నేపథ్యంలో మేస్త్రీల కొరత ఏర్పడకుండా మహిళలకు సైతం ట్రైనింగ్ ఇస్తున్నట్లు చెప్పారు. రూ. ఐదు లక్షల బడ్జెట్లో క్వాలిటీతో ఇల్లు ఎలా కట్టాలో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం ట్రైనింగ్ తీసుకుంటున్న మహిళలకు సేఫ్టీ మెటీరియల్, హెల్మెట్, టీషర్ట్, బ్యాగ్, బుక్, పెన్ అందించారు. ట్రైనింగ్ పూర్తి చేసుకున్న మహిళలకు సర్టిఫికెట్స్ సైతం ఇస్తామని కలెక్టర్ చెప్పారు. కార్యక్రమంలో హౌసింగ్ పీడీ భాస్కర్ పాల్గొన్నారు.