volleyball championship: భారత్‌లో తొలిసారి వాలీబాల్‌ క్లబ్‌ ప్రపంచ చాంపియన్‌షిప్‌!

volleyball championship: భారత్‌లో తొలిసారి వాలీబాల్‌ క్లబ్‌ ప్రపంచ చాంపియన్‌షిప్‌!

న్యూఢిల్లీ: భారత్‌లో తొలిసారి వాలీబాల్‌ క్లబ్‌ చాంపియన్‌షిప్‌ అభిమానుల ముందుకు రాబోతోంది వాలీబాల్‌ వరల్డ్‌, ఎఫ్‌ఐవీబీ సంయుక్త ఆధ్వర్యంలో పురుషుల వాలీబాల్‌ క్లబ్‌ ప్రపంచ చాంపియన్‌షిప్‌నకు రంగం సిద్ధమైంది.  రూపే ప్రైమ్‌ వాలీబాల్‌ లీగ్‌ నిర్వహిస్తున్న ఏ23 భాగస్వామ్యంతో  క్లబ్‌ వరల్డ్‌ చాంపియన్‌షిప్‌ అలరించనుంది. ఈ ఏడాదితో పాటు 2024 ప్రైమ్‌ వాలీబాల్‌ లీగ్‌లో చాంపియన్‌గా నిలిచే జట్లు.. భారత్‌ తరపున క్లబ్‌ వరల్డ్‌కప్‌లో పోటీకి దిగుతాయి. ప్రపంచంలో వాలీబాల్‌ పవర్‌హౌజ్‌లుగా వెలుగొందుతున్న ఇటలీ, బ్రెజిల్‌, ఇరాన్‌ లాంటి దేశాల ప్లేయర్లతో కలిసి భారత ప్లేయర్లు బరిలోకి దిగనున్నారు. ఈ ఏడాది డిసెంబర్‌ 6 నుంచి 10 వరకు భారత్‌లో క్లబ్‌ వరల్డ్‌ చాంపియన్‌ జరుగనుంది. అయితే ఆతిథ్యమిచ్చే నగరం ఈ ఏడాది ఆఖర్లో తెలిసే అవకాశముంది.

2022లో మొదలైన వాలీబాల్‌ లీగ్‌ ద్వారా అంతర్జాతీయ స్థాయి ప్లేయర్లు వెలుగులోకి వచ్చారు. ఈ లీగ్ తొలి సీజన్‌తోనే చాలామంది అభిమానుల్ని సంపాధించుకుంది. ప్రపంచంలోని ప్రముఖ క్లబ్‌ల ద్వారా దాదాపు 350,000 యూఎస్‌ డాలర్ల ప్రైజ్‌మనీ అందనుంది. 2028 ఒలింపిక్స్‌కు భారత వాలీబాల్‌ జట్టు అర్హత సాధించేందుకు ఈ క్లబ్‌ లీగ్‌ సాయపడుతుంది. ఎఫ్‌ఐవీబీ అధ్యక్షుడు డాక్టర్‌ ఆరీ గ్రాసా మాట్లాడుతూ ‘భారత క్రీడారంగంలో ఇది చారిత్రక సందర్భం. ఎఫ్‌ఐవీబీ ద్వారా దేశంలో అత్యుత్తమ వాలీబాల్‌ పోటీలను తొలిసారి అభిమానుల ముందుకు తీసుకురాబోతున్నాం. ఈ లీగ్ లో ప్రపంచంలోని ప్రముఖ క్లబ్‌లు పాలుపంచుకుంటున్నాయి. ఆతిథ్య హోదాలో భారత్‌తో పాటు వివిధ దేశాల నుంచి ప్లేయర్లు లీగ్‌లో పోటీపడబోతున్నారు. లీగ్‌ను ఇక్కడికి తీసుకురావడం చాలా థ్రిల్లింగ్‌గా ఫీల్‌ అవుతున్నాం’ అన్నాడు. ఈ టోర్నీకి అర్హత సాధించిన జట్లు, తుది షెడ్యూల్‌ను ఈ ఏడాది ఆఖర్లో తెలుస్తాయి.