
హత్నూర (సంగారెడ్డి), వెలుగు: కల్తీ పాలను తయారు చేస్తున్న ముఠాను బుధవారం పోలీసులు పట్టుకున్నారు. కేసుకు సంబంధించిన వివరాలను ఎస్పీ రూపేశ్ బుధవారం వెల్లడించారు. సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం గోవిందరాజుపల్లికి చెందిన బొమ్మ శంకరయ్య, కొడుకు రాఘవేందర్ తమకున్న 3.25 ఎకరాల పొలంలో డెయిరీ ఫాం నడుపుతున్నారు. వీరిద్దరు బిహార్కు చెందిన మతోశ్ రాయ్, బికాశ్ కుమార్తో కలిసి కల్తీ పాలు తయారుచేస్తున్నారు. ఇందులో భాగంగా పాల పౌడర్, రెండు లీటర్ల ఆయిల్, రెండు లీటర్ల పాలతో 30 లీటర్ల కృత్రిమ పాలు తయారు చేసేవారు. ఇలా రోజుకు 1,800 లీటర్ల వరకు తయారు చేసి వాటిని వివిధ ప్రాంతాల్లో అమ్మేవారు.
డెయిరీ ఫామ్పై అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు డెయిరీపై దాడి చేయగా కల్తీ పాల గుట్టు బయటపడింది. దీంతో శంకరయ్య, రాఘవేందర్, మతోశ్ రాయ్, బికాశ్కుమార్తో పాటు, డ్రైవర్ వినయ్కుమార్ను అదుపులోకి తీసుకున్నారు. కల్తీ పాలు తయారు చేసే వారిపై చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. పటాన్చెరు డీఎస్పీ రవీందర్రెడ్డి, తహసీల్దార్ ఫారిన్ షేక్, సీసీఎస్ ఇన్స్పెక్టర్ కిశోర్, హత్నూర ఎస్సై సుభాశ్, సీసీఎస్ ఎస్సై సాయిలు, లాల్ అహ్మద్, ఎస్సై దుర్గారెడ్డి పాల్గొన్నారు.