
అమరావతి: తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు సమీపంలోని తాళ్లపూడి మండలం తాడిపూడిలో విషాదం చోటుచేసుకుంది. గోదావరిలో స్నానాలకు దిగి ఐదుగురు చనిపోయారు. మహాశివరాత్రి సందర్భంగా ఇవాళ తెల్లవారుజామున 11 మంది యువకులు గోదావరిలో స్నానం చేసేందుకు వెళ్లారు. నదిలో లోతుగా ఉన్న ప్రదేశాన్ని గుర్తించకపోవడంతో వారిలో ఐదుగురు నీటిలో మునిగిపోయారు.
ఈ క్రమంలో ఒకరినొకరు రక్షించుకునే ప్రయత్నంలో ఆ ఐదుగురూ గల్లంతై ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు స్పాట్ కు చేరుకుని గజ ఈతగాళ్ల సాయంతో డెడ్బాడీలను బయటకు తీశారు. మృతులను తిరుమల శెట్టి పవన్ (17), పడాల దుర్గాప్రసాద్ (19), పడాల సాయి కృష్ణ (19), అనిసెట్టి పవన్ (19), గర్రె ఆకాశ్ (19)గా గుర్తించారు.
వీరంతా కొవ్వూరు, తాళ్లపూడి, రాజమహేంద్రవరంలో ఇంటర్, డిగ్రీ చదువుతున్నారు. యువకులంతా ఒకే గ్రామానికి చెందిన వారు కావడంతో విషాదఛాయలు అలముకున్నాయి. కొవ్వూరు ఆర్డీవో రాణి సుస్మిత, డీఎస్పీ దేవకుమార్ గాలింపు చర్యలను పర్యవేక్షించారు.