
వరంగల్, వెలుగు: వరంగల్ పోలీస్ కమిషనరేట్కు శిక్షణ పూర్తి చేసుకున్న ఐదు జాగిలాలను తీసుకొచ్చారు. నేరాలకు పాల్పడిన నిందితుల ఆచూకీ కనిపెట్టడంలో ఇవి కీలకంగా వ్యవహరించనున్నాయి. ఫిబ్రవరి 28 కి 8 నెలల ట్రైనింగ్ పూర్తి చేసుకున్నాయి. పేలుడు పదార్థాలను పసిగట్టే ఈ ఐదింటిలో 3 బెల్జియన్ మాలినోస్, 2 గోల్డెన్ రిట్రీవర్ జాతులకు చెందినవి ఉన్నాయి.
మంగళవారం డాగ్ స్క్వాడ్లో చేరుతున్న జాగిలాలను సీపీ అంబర్ కిషోర్ ఝా పరిశీలించారు. వీటికి రానా, జానీ, డయానా, మాక్స్, కైరో పేర్లు పెట్టారు. కొత్తగా వచ్చిన జాగిలాలకు మెరుగైన వసతి కల్పించాలని ఆదేశించారు. అడిషనల్ డీసీపీ సురేశ్ కుమార్, ఆర్ఐ శ్రీనివాస్, డాగ్ స్క్వాడ్ ఇన్చార్జి హెడ్ కానిస్టేబుల్ ప్రభాకర్, హ్యాండ్లర్లు పాల్గొన్నారు.