
- ఇల్లందులో రూ. 30 వేలు తీసుకుంటూ పట్టుబడిన ఎఫ్ఆర్వో, ఎఫ్ బీవో
- మక్తల్లో రూ.20 వేలు తీసుకుంటుండగా సీఐ, ఇద్దరు కానిస్టేబుళ్లు పట్టివేత
ఇల్లందు/మక్తల్, వెలుగు: లంచం తీసుకుంటూ మంగళవారం వేర్వేరు చోట్ల ఐదుగురు ఆఫీసర్లు ఏసీబీకి పట్టుబడ్డారు. భద్రాద్రికొత్తగూడెం జిల్లా ఇల్లందులో ఎఫ్ఆర్వో, ఎఫ్బీవో, నారాయణపేట జిల్లా మక్తల్లో సీఐ, ఇద్దరు కానిస్టేబుళ్లు ఏసీబీకి చిక్కారు. ఇల్లందు డివిజన్లోని కొమరారం రేంజ్ ఆఫీస్లో ఎఫ్ఆర్వో రెంటాల ఉదయ్ కుమార్, మాణిక్యారం బీట్ ఆఫీసర్ నునావత్ హరిలాల్ రూ.30 వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్నట్లు ఏసీబీ డీఎస్పీ వై రమేశ్ తెలిపారు.
కొమరారం గ్రామానికి చెందిన ఓ కాంట్రాక్టర్కు మట్టి రోడ్డు పని కోసం ఫారెస్ట్ ల్యాండ్ నుంచి గ్రావైల్ తీసుకెళ్లేందుకు ఎఫ్ఆర్వోడబ్బులు డిమాండ్ చేయగా, గతంలో రూ.20వేలు ఇచ్చాడు. పనులు జరుగుతుండగా తన సిబ్బందిని పంపించి ట్రాక్టర్, జేసీబీని సీజ్చేయించి, వాటిని రిలీజ్ చేయడానికి రూ.15 వేలు తీసుకున్నాడు. అంతటితో ఆగకుండా మళ్లీ రూ.50 వేలు డిమాండ్ చేయగా, సదరు కాంట్రాక్టర్ రూ.30 వేలు ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకొని, ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. వారి సూచనల మేరకు డబ్బులను బీట్ ఆఫీసర్ హరిలాల్కు ఇవ్వగా, రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.
చార్జిషీట్ కోసం రూ.20 వేలు డిమాండ్..
ఓ కేసులో నిందితుడికి అనుకూలంగా చార్జిషీట్ వేస్తానని చెప్పి రూ.20 వేలు లంచం తీసుకుంటూ నారాయణపేట జిల్లా మక్తల్ సీఐ చంద్రశేఖర్, కానిస్టేబుళ్లు నరసింహ, శివారెడ్డి ఏసీబీకి పట్టుబడ్డారు. వివారాల్లోకి వెళితే.. మక్తల్ పట్టణంలో శ్రీనిధి కో ఆపరేటివ్ సొసైటీ డైరెక్టర్ సంధ్యా వెంకట్రాములు ఓ కేసులో నిందితుడు. ఆయనపై మక్తల్ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. ఇటీవలే అయనకు హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
ప్రతి సోమవారం ఆయన మక్తల్ పోలీస్ స్టేషన్కు వచ్చి సంతకం పెట్టాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఆయనకు అనుకూలంగా చార్జిషీట్ వేస్తానని చెప్పి సీఐ రూ.20 వేలు లంచం డిమాండ్ చేయగా, బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. వారి సూచనల మేరకు రూ.20 వేలు కానిస్టేబుళ్లునరసింహ, శివారెడ్డికి ఇవ్వగా, రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. వీరితో పాటు సీఐ చంద్రశేఖర్ను అదుపులోకి తీసుకొని మక్తల్ సర్కిల్ ఆఫీస్లో సోదాలు నిర్వహించారు. సీఐ, కానిస్టేబుళ్లను ఏసీబీ కోర్టులో హాజరు పర్చుతామని మహబూబ్నగర్ ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ తెలిపారు.