హైదరాబాద్, వెలుగు: నైపుణ్యం, విస్తరణ, వ్యాపార సామర్థ్యాల పెంపుపై దృష్టి పెట్టాలని తెలంగాణ ప్రభుత్వ పరిశ్రమలు, వాణిజ్యం, సమాచార సాంకేతికత (ఐటీ) విభాగాల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ కంపెనీలకు సూచించారు. రాష్ట్రంలో గ్లోబల్ కెపాసిటీ సెంటర్ల (జీసీసీ) వృద్ధి కోసం ప్రభుత్వంతో వ్యాపార ప్రముఖులు చర్చించేందుకు హైదరాబాద్లో మూవ్ ఇన్ సింక్ జీసీసీ కాన్క్లేవ్ 2025 నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్లోబల్ కెపాసిటీ సెంటర్లు ఆర్థిక వృద్ధికి మూలమన్నారు.
ఇవి మన ఆర్థిక వ్యవస్థకు ప్రధానమైన వృద్ధి శక్తిగా మారాయన్నారు. హైదరాబాద్ అన్నింటా మొదటిస్థానంలో ఉందని, దీనికి గ్లోబల్ కెపాసిటీ సెంటర్ల సహకారం ఎంతో ఉందని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన టైర్-2 సిటీల పాలసీ ద్వారా హైదరాబాద్ వెలుపల కంపెనీలు ఏర్పాటు చేస్తే ప్రోత్సాహకాలు అందిస్తున్నట్టు జయేశ్ రంజన్ తెలిపారు.