
- నిందితుడిని అరెస్ట్ చేసి 18 బైక్ లు స్వాధీనం
- కాజీపేట ఏసీపీ తిరుమల్ వెల్లడి
హసన్ పర్తి,వెలుగు : ఫుడ్ డెలివరీ సంస్థల్లో పని చేస్తూ బైక్ లను ఎత్తుకెళ్లిన దొంగను హనుమకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద 18 బైక్ లను స్వాధీనం చేసుకున్నారు. కాజీపేట ఏసీపీ తిరుమల్ మీడియాకు తెలిపిన ప్రకారం.. జనగామ జిల్లా చిల్పూర్ మండలం ఫతేపూర్ గ్రామానికి చెందిన గుగులోత్ చందు లాల్(24), హనుమకొండ పరిధి గోపాల్ పూర్ లో ఉంటూ ఫుడ్ డెలివరీ బాయ్ గా పని చేస్తున్నాడు.
జల్సాలకు అలవాటు పడిన అతడికి వచ్చే ఇన్ కమ్ సరిపోకపోగా బైక్ లను చోరీ చేస్తున్నాడు. బుధవారం హసన్ పర్తిలో పోలీసులు వాహనాల తనిఖీలు చేస్తున్నారు. అనుమానాస్పదంగా బైక్ పై వచ్చిన చందులాల్ పోలీసులను చూసి పారిపోతుండగా పట్టుకుని విచారించగా పలు పీఎస్ ల పరిధిలో 18 బైక్ లను ఎత్తుకెళ్లినట్టు తేలింది. నిందితుడి వద్ద బైక్ లతో పాటుసెల్ ఫోన్ స్వాధీనం చేసుకుని రిమాండ్ కు తరలించినట్టు ఏసీపీ తెలిపారు.