శ్రీచైతన్య కాలేజీలో ఫుడ్ ​పాయిజన్.. క్యాంపస్లో ట్రీట్మెంట్

శ్రీచైతన్య కాలేజీలో ఫుడ్ ​పాయిజన్.. క్యాంపస్లో ట్రీట్మెంట్
  • క్యాంపస్​లోనే గోప్యంగా 100 మంది స్టూడెంట్స్​కు ట్రీట్మెంట్
  • కాలేజీ ముందు విద్యార్థి సంఘాల ఆందోళన

మాదాపూర్, వెలుగు: మాదాపూర్​అయ్యప్ప సొసైటీలో ఉన్న శ్రీచైతన్య కాలేజీ అక్షర భవన్​క్యాంపస్​లో గురువారం ఫుడ్​ పాయిజన్ జరిగినట్లు తెలుస్తోంది. దాదాపు 100 మంది స్టూడెంట్స్​కడుపునొప్పి, విరేచనాలు, జ్వరంతో బాధపడుతుండడంతో కాలేజీ మేనేజ్మెంట్ క్యాంపస్​లోనే గోప్యంగా ట్రీట్మెంట్ అందించింది. తొలుత ఈ విషయం పిల్లల తల్లిదండ్రులకు తెలియకుండా జాగ్రత్త పడింది. 

కొందరి పరిస్థితి విషమంగా ఉండడంతో శుక్రవారం వారి తల్లిదండ్రులను పిలిపించి మెరుగైన ట్రీట్మెంట్​ కోసం బయటకు పంపించింది. అంతకుముందు అస్వస్థతకు గురైన స్టూడెంట్స్, వారి తల్లిదండ్రులను బయటకు రానీయకుండా కాలేజీ గేట్లను మూసివేసింది. దీంతో ఏబీవీపీ నాయకులు క్యాంపస్ ముందు ఆందోళనకు దిగారు. 

ఈ క్రమంలో మాదాపూర్​ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వారిని అదుపులోకి తీసుకున్నారు. కాలేజీ మేనేజ్మెంట్​ను వివరణ కోరగా, ఎలాంటి ఫుడ్​ పాయిజన్ జరగలేదని, విద్యార్థులకు వైరల్​ఫీవర్​ వచ్చినట్లు తెలిపారు. 

కాలేజీకి రూ.2 లక్షల ఫైన్

మరోవైపు, కాలేజీ క్యాంపస్​ను స్టేట్​ ఫుడ్​ సేఫ్టీ అధికారులు శుక్రవారం సందర్శించి శాంపిల్స్ సేకరించి ల్యాబ్​కు పంపారు. అలాగే కాలేజీ కిచెన్, క్యాంటీన్​ను జీహెచ్ఎంసీ చందానగర్​సర్కిల్​అధికారులు తనిఖీ చేశారు. ఫైర్ ​సేఫ్టీ, ట్రేడ్​ లైసెన్స్ లేకపోవడంతో రూ. 2లక్షలు ఫైన్ విధించారు.