హోటల్​ వివేరాపై ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ల దాడులు

 హోటల్​ వివేరాపై ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ల దాడులు

యాదాద్రి, వెలుగు : ఉన్నతాధికారుల ఆదేశాలతో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు యాదాద్రి జిల్లాలోని హోటల్​ వివేరాపై దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎక్స్​ఫైరీ డేట్ లేని వస్తువులను ధ్వంసం చేశారు. ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.. హోటల్​వివేరాలో ఇటీవల ఓ వినియోగదారుడు బిర్యానీకి ఆర్డర్ చేసి తింటుండగా, దాంట్లో  జెర్రీ వచ్చింది. దీంతో సదరు వినియోగదారుడు హోటల్ యాజమాన్యంపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడంతోపాటు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించాడు. 

దీంతోపాటు బిర్యానీకి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్​ చేశాడు. ఆ వీడియో కాస్తా ఫుడ్​సేఫ్టీ కమిషనర్​వద్దకు చేరింది. హోటల్​వివేరాలో తనిఖీ చేయాలని యాదాద్రి ఫుడ్ సేఫ్టీ డిజిగ్నేటెడ్ ఆఫీసర్ డాక్టర్ ఎం.సుమన్ కల్యాణ్, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ స్వాతిని ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం హోటల్​వివేరాపై ఫుడ్​సేఫ్టీ అధికారులు దాడులు చేశారు.

కిచెన్​లో మూతలు లేని బకెట్లలో చట్నీలను నిల్వ చేయడాన్ని గమనించారు. తయారీ, ఎక్స్ ఫైరీ తేదీ లేకుండా కొన్ని వస్తువులు, కూల్​ డ్రింక్స్ ఉండడంతో వాటిని పరిశీలించి ధ్వంసం చేశారు. అపరిశుభ్ర వాతావారణంలో కిచెన్​ ఉండడం, అక్కడే వంట కోసం నిల్వ చేసిన చికెన్ ముక్కలను పరిశీలించారు. అనంతరం హోటల్ యజమానికి నోటీసులు జారీ చేశారు. ఆహార పదార్థాల శాంపిల్స్ సేకరించి హైదరాబాద్​లోని ​ల్యాబ్​కు పంపించారు.