ఎక్కడ చూసినా కల్తీనే .. జనగామ పట్టణంలో విచ్చలవిడిగా హానికర కలర్స్ వినియోగం

ఎక్కడ చూసినా కల్తీనే .. జనగామ పట్టణంలో విచ్చలవిడిగా హానికర కలర్స్ వినియోగం
  • హోటల్​ నిర్వాహకుల ఇష్టారాజ్యం
  • తరుచుగా హోటళ్లు, సూపర్​ మార్కెట్​లలో కల్తీ ఫుడ్ ఘటనలు

జనగామ, వెలుగు: జనగామ పట్టణంలోని హోటళ్లలో కల్తీఫుడ్, సూపర్ మార్కెట్ లో ఎక్స్ ఫైరీ ఐటంల అమ్మకాలతో  ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. జిల్లా కేంద్రంలో  హోటళ్లు, సూపర్​ మార్కెట్లు, ఫాస్ట్​ ఫుడ్​ సెంటర్​ల నిర్వహణ  అధ్వాన్నంగా మారింది.  అడిగేవారు లేక ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. జిల్లాలో 200లకు పైగా హోటళ్లు ఉండగా ఎక్కువ మొత్తం వాటిలో నాణ్యతా ప్రమాణాలు గాలికి వదిలేశారు. టేస్ట్​ కోసం హానికర కలర్స్​ను విచ్చలవిడిగా ఉపయోగిస్తున్నారు. కొన్ని హోటళ్లలో కుళ్లిన పదార్థాలను సైతం వాడుతూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. ఇంత జరుగుతున్నా అధికారుల పట్టింపులేని తీరు విమర్శలకు తావిస్తోంది.

  • ఈ నెల 20న జనగామ జిల్లా  కేంద్రం హైదరాబాద్​ రోడ్​లోని క్యూటీక్యూ హోటల్​లో  ఓ యువకుడు చికెన్​ బిర్యానీ ఆర్డర్​ చేశాడు. బాధితుడికి చికెన్​లో బొద్దింక కనిపించింది. భోజనంలో బొద్దింక రావడం ఏమిటని నిర్వాహకులను ప్రశ్నించాడు. నిర్వాహకులు నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. ఆఫీసర్లు  హోటల్​ సీజ్​ చేసి రూ.10 వేల జరిమానా విధించారు. మరుసటి రోజు నుంచే సదరు హోటల్​ కార్యకలాపాలు యధావిధిగా సాగుతుండడంతో పలువురు సోమవారం కలెక్టరేట్​ గ్రీవెన్స్​లో ఫిర్యాదు చేశారు.​
  • గత నెల ఫిబ్రవరి 24న జనగామలోని నెహ్రూ పార్క్​ రోడ్​లో ఉన్న మోర్​ సూపర్​ మార్కెట్​లో  కొన్న డ్రై ఫ్రూట్ నట్స్​ప్యాకెట్​లో పురుగులు వచ్చాయని ​బాధితుడు నేతి ఉపేందర్ అధికారులకు ఫిర్యాదు చేశాడు. అధికారులు తనిఖీలు చేపట్టి సూపర్​ మార్కెట్​ను సీజ్​ చేసి రూ 20 వేల జరిమానా  విధించారు. కాగా తాజాగా ఇలాంటి సంఘటనే ఇదే మార్కెట్ లో చోటు చేసుకోగా.. మళ్లీ అధికారులు రూ. 10 వేల జరిమానా విధించారు.
  • ఫుడ్​ సేఫ్టీ, మున్సిపల్​ అధికారులు వచ్చి మొక్కుబడి తనిఖీలు చేసి ఎంతో కొంత ఫైన్​ వేసి వదిలేస్తున్నారు. సదరు నిర్వాహకులు మరుసటి రోజు నుంచే ఎప్పటిలాగే కల్తీ ఫుడ్​ దందాను కొనసాగిస్తున్నారు. హోటల్​ నిర్వాహకులపై కఠినంగా వ్యవహరించాల్సిన అధికారులు అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. 

నాణ్యత మరిచి 

నాణ్యత పాటించాల్సిన నిర్వాహకులు ధనార్జనకు తెగబడ్డారు.  పలువురు నిర్వాహకులు కుళ్లిన మాంసం,  ఫ్రిడ్జిల్లో  రోజుల తరబడి నిల్వ ఉంచిన పదార్థాలను వాడుతున్నారు. కిచెన్​లో, భోజనాలు వడ్డించే స్టాఫ్​ కనీస పరిశుభ్రత పాటించడం లేదు. జనగామకు రెగ్యులర్​ ఫుడ్​ ఇన్స్​పెక్టర్​ లేరు. ఇంచార్జ్​ గా ఉన్న కృష్ణ మూర్తి ఎప్పుడు వస్తారో ఎక్కడ తనిఖీలు చేస్తారో అంతా గోప్యంగానే ఉంటోంది. 

కలెక్టర్​ ఆదేశాలు బేఖాతర్​ 

ఆహారభద్రత విషయంలో కఠినంగా వ్యవహరించాలని కలెక్టర్​ రిజ్వాన్​ బాషా షేక్​ ఇటీవల కలెక్టరేట్​లో నిర్వహించిన రివ్యూలో స్ట్రాంగ్​ వార్నింగ్​ ఇచ్చారు. అయినా సంఘటన జరిగినప్పుడు మాత్రమే వచ్చి హడావుడి చేస్తున్నారు. రెండు నెలల క్రితం హైదరాబాద్​ రోడ్​లోని బిర్యానీ హోటల్​లో హానికర కలర్స్​ వాడుతున్నారని, కుళ్లిన మాంసం ఉపయోగిస్తున్నారని కేసులు నమోదయ్యాయి. ఇప్పటికైనా అధికారులు తనిఖీలు ముమ్మరం చేయాలని పలువురు కోరుతున్నారు.