
మనిషి శరీరంలో ప్రతిభాగం ముఖ్యమే.. శరీరంలో ఎక్కువ కష్టపడేవి పాదాలు. ఎక్కువ నిర్లక్ష్యానికి గురయ్యేవి కూడా పాదాలే! ఎందుకంటే పాదాలు .. అరికాళ్లు శరీర బరువుని మోస్తాయి. ఎక్కడికంటే అక్కడికి తీసుకెళ్తాయి. నడక నేర్చినప్పటి నుంచీ నిరంతరం శ్రమిస్తూనే ఉంటాయి. అయినా ఇతర అవయవాల మాదిరిగా పాదాల ఆరోగ్యం గురించి పెద్దగా పట్టించుకోరు చాలామంది. చూసీచూడనట్టు వదిలేస్తారు. అందుకే రకరకాల కారణాల వల్ల పాదాల మంటల సమస్య ఎదుర్కొంటారు
కాళ్లకు చెప్పులు వేసుకోవడం తప్పితే.. ప్రత్యేకంగా తీసుకునే శ్రద్ధ ఏమీ ఉండదు. పాదాలు పగిలి బాధిస్తున్నా.. లేదంటే కాలి గోళ్లు చిట్లి వేధిస్తున్నా వాటి గురించి పట్టించుకోరు. అయితే, పాదాలను సరిగ్గా పట్టించుకోకుంటే ఎన్నో అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి వాటి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటున్నారు వైద్య నిపుణులు.
మంచి చెప్పులు : పాదాలను కాపాడుకోవడమనేది మంచి చెప్పులు లేదా షూ వేసుకోవడం నుంచే మొదలుపెట్టాలి. రెండు పాదాల పొడవును కొలిచి, రెండింటికీ సౌకర్యంగా ఉండే చెప్పులు వేసుకోవాలి. షూస్ పాదం చివరే ముగియకుండా ముందు భాగంలో కొంత ఖాళీతో పాటు మరో రెండు సెంటీమీటర్లు ఎక్కువగా ఉండాలి. అలా ఖాళీ ఉందో లేదో చూసుకోవాలి. అలాగే మడాలు మరీ ఎత్తుగా లేకుండా చూసుకోవాలి.
పొడిగా ఉండేలా: వీలున్నప్పుడు పాదాలను కొద్దిగా సాగదీయాలి. దీనివల్ల పాదాలపై పడే ఒత్తిడి తగ్గు తుంది. బిగుసుకు పోయిన కండరాలు సాగుతాయి. అలాగే ప్రతిరోజు పాదాల్ని గోరు వెచ్చని నీటితో లేదంటే సబ్బుతో శుభ్రం చేయాలి. కాలి వేళ్ల మధ్య ఏమాత్రం తడి లేకుండా తుడవాలి.. లేదంటే ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది. కాళ్లు కడుక్కున్న తర్వాత పాదాలను పొడిగా తుడిచి... ఆపై వేజిలైన్ రాయాలి
పాదాల వ్యాయామం :పాదాల కోసం చేయాల్సిన వ్యాయామాలు చాలా రకాలు. రోజూ వ్యాయామం చేయడం వల్ల కూడా వాటి ఆరోగ్యం బాగుంటుంది. వాకింగ్, రన్నింగ్, సైక్లింగ్, స్కిప్పింగ్ లాంటివి పాదాల కండరాలు తేలికగా కదలటానికి, బలంగా అవ్వ డానికి, రక్తప్రసరణ బాగా జరగడానికి ఉపయోగపడతాయి. ఏ వయసు వాళ్లైనా బ్రిస్క్ వాకింగ్ చేయడం ఆరోగ్యకరం. అది కాళ్లతో పాటు అన్ని అవయవాలకు ఆరోగ్యాన్నిస్తుంది.
గోళ్ల సంరక్షణ :ప్రతివారం కాలిగోళ్లు కట్ చేసుకోవాలి. ఆసమయంలో గోళ్లను మరీ లోపలికి కట్ చేయకూడదు. నెయిల్ పాలిష్ తీసేసిన తర్వాత గోళ్ల మీద మాయిశ్చరైజర్ క్రీమ్ రాయాలి. గోళ్ల మీద ఉండే పొర చాలా సున్నితంగా ఉంటుంది. కాబట్టి, జాగ్రత్తగా ఆ పొరను తీయాలి. కొన్నిసా ర్లు గోళ్లకు అదేపనిగా రంగులు వేయడం వల్ల పసుపుగా మారతాయి. కాబట్టి అప్పుడప్పుడు నెయిల్ పాలిష్ వేయడం మానేయాలి. దానివల్ల గోళ్లకు గాలి తగిలి తాజాగా ఉంటాయి.
పాదాల్లో పగుళ్లు : పాదాల పగుళ్లకు చాలా కారణాలు ఉంటాయి. శరీరానికి తగిన నీరు అందకపోయినా పగుళ్లు వస్తాయి. స్నానానికి వాడే సబ్బుతో పాటు ఆహారంలో న్యూట్రిషన్స్ తక్కువగా ఉండటం ఇందుకు కారణం కావచ్చు, ఎండవేడితో కూడా పగుళ్లబాధలు ఎక్కువవుతాయి. పాదాల పగుళ్ల సమస్య నుంచి ఉపశమనం పొందాలంటే. మంచినీళ్లు ఎక్కువగా తాగాలి. గోరువెచ్చటి నీటిలో కొంచెం ఉప్పు వేసి కాళ్లను కొన్ని నిమిషాల పాటు ఉంచాలి. తర్వాత శుభ్రంగా కడిగి.. పొడి బట్టతో తుడవాలి. మాయిశ్చరైజర్ ఎక్కువగా ఉండే క్రీములు కాళ్లకు రాసుకొని సాక్సులు వేసుకోవడం మంచిది.
హై హీల్స్ : ఎత్తుమడాల చెప్పులతో పాదాల నొప్పి మాత్రమే కాకుండా ఎన్నో సమస్యలు వస్తాయి. వేళ్ల దగ్గర బొబ్బలు, వేళ్లు వంగిపోవటం, మడమ నుంచి వేళ్ల వరకు ఉండే కణజాలపు పొర వాపు, గోళ్లు లోపలి వైపునకు పెరగటం లాంటి సమస్యలు పెరుగుతాయి. కాబట్టి మడాలను మరీ ఎత్తుగా ఉంచే చెప్పులకు దూరంగా ఉండాలి
అవసరమైతే చికిత్స : చాలామంది తలనొప్పి లాంటివి వస్తే వెంటనే డాక్టర్ దగ్గరకు వెళ్తారు. అదే పాదాల్లో నొప్పిగా ఉంటే పెద్దగా పట్టించుకోరు. అయితే, అది మంచి పద్ధతి కాదు. పాదం కూడా శరీరంలో ఒక భాగమే. ఇబ్బంది ఉన్నప్పుడు డాక్టర్ను సంప్రదించాలి. ఇంట్లో కూడా పాదరక్షలు వాడాలి. తడి, తేమలో పనిచేసే వాళ్లు స్లిప్పర్స్ లాంటివి వేసుకోవాలి.