
- అజంజాహి కార్మికులకు మడిపల్లిలోనే ప్లాట్లు
- నేడు హనుమకొండ కలెక్టరేట్లో డ్రా
- 318 మందికి ప్లాట్లు కేటాయించనున్న ఆఫీసర్లు
వరంగల్, వెలుగు : ‘కోర్టు తీర్పు తమకు అనుకూలంగా ఉంది.. ఇక ప్లాట్లు అందుకోవడమే మిగిలింది’ అని ఆశపడుతున్న అజంజాహి మిల్లు కార్మికులకు నిరాశ ఎదురైంది. ఆఫీసర్ల నిర్లక్ష్యం... అధికార పార్టీ నేతలు తెర వెనుక చక్రం తిప్పడంతో కనీస సౌకర్యాలు లేని చోట ప్లాట్లను తీసుకోవాల్సి వస్తోంది. అజంజాహి మిల్లు కార్మికులకు నగరంలో కాకుండా 20 కిలోమీటర్ల దూరంలోని మడికొండ ‘మా సిటీ’ వెంచర్లో పాట్లు ఇచ్చేందుకు ఆఫీసర్లు నిర్ణయించారు. ప్లాట్ల అలాట్మెంట్ల కోసం శనివారం ఉదయం 9.30 గంటలకు లక్కీ డ్రా తీయనున్నట్లు ప్రకటించారు.
లేనిది ఉన్నట్లు చూపిన్రు
అజాంజాహి మిల్లు వద్ద స్థలం కంటే మడికొండలోని ‘మా సిటీ’ ప్లాట్లు బెటర్ అని ప్రజాప్రతినిధులు కార్మికులను తప్పుదోవ పట్టించారు. ఆజాంజాహి భూములు మార్కెట్లో గజం రూ. లక్ష పలుకుతుండగా మడికొండలో ప్లాట్ల వేలంలో రూ. 15 వేల నుంచి రూ. 18 వేలు పలుకుతున్నట్లు చూపించారు. మా సిటీ వెంచర్లో స్కూళ్లు, కాలేజీలు, హస్పిటల్స్, బస్ ఫెసిలిటీ ఉన్నట్లు చెప్పారు. మడిపల్లి నుంచి 2.5 కిలోమీటర్ల దూరం వస్తేనే బస్సు సౌకర్యం ఉంటుంది. కానీ ఆఫీసర్లు మాత్రం కిలోమీటర్ మాత్రమే ఉన్నట్లు చూపించారు. మూడు నెలల్లో వెంచర్లో అన్ని సౌకర్యాలు కల్పించాకే కార్మికులకు ప్లాట్లు కేటాయిస్తామని ఆఫీసర్లు, లీడర్లు హామీ ఇచ్చారు. అయినా ఇప్పటివరకు అక్కడ మంచినీరు, కరెంట్, బస్టాండ్ వంటి సౌకర్యాలు కల్పించలేకపోయారు. కోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా 318 మందికి హడావుడిగా ప్లాట్లు కేటాయించేందుకు నిర్ణయించారు.
మడిపల్లిలో ప్లాట్ల కేటాయింపును రద్దు చేయాలి
వరంగల్ సిటీ, వెలుగు : అజంజాహి మిల్లు కార్మికులకు మడిపల్లిలో ఇండ్ల స్థలాల కేటాయింపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కార్మిక సంఘం నేత అనుముల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. స్థానిక ప్రెస్క్లబ్లో శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ఇండ్ల స్థలాల కేటాయింపు విషయంలో సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలని కోరారు. ఆఫీసర్ల నిర్లక్ష్యం వల్లే స్థలాల కేటాయింపు ఆలస్యమైందన్నారు. నగరానికి 20 కిలోమీటర్ల దూరంలో గుట్టల
ప్రాంతాన్ని తీసుకోవాలని, లేకుంటే అవి కూడా దక్కవని భయపెట్టడం సరికాదన్నారు.