
ఫారెన్ ఫండ్స్ తో లక్షల్లో జీతాలు ఇస్తూ.. సంపాదన ఎరగా వేస్తూ పోర్న్ రాకెట్ నడుపుతున్న దంపతులను పట్టుకున్నారు ఈడీ అధికారులు. నోయిడాలో ఉజ్జ్వల్ కిషోర్, నీలు శ్రీవాస్తవ అనే దంపతులు నడిపిస్తున్న ఆన్లైన్ పోర్నోగ్రఫీ రాకెట్ గుట్టు రట్టు చేశారు. వీళ్ల నుంచి రూ. 15.66 కోట్ల అక్రమ విదేశీ నిధులను ఈడీ స్వాధీనం చేసుకుంది. సైప్రస్ కేంద్రంగా పనిచేస్తున్న టెక్నియస్ లిమిటెడ్తో సహకారంతో ఎక్స్ హామ్స్టర్, స్ట్రిప్చాట్ వంటి పోర్న్ సైట్స్ నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ జంట 'echato dot com' పేరుతో ఒక పేజీని సృష్టించి, ఆకర్షణీయమైన జీతాలు ఇస్తామని ప్రకటనలు ఇచ్చారు. ఢిల్లీ-ఎన్సిఆర్ ప్రాంతానికి చెందిన చాలా మంది మహిళలు ఈ ప్రకటనల ద్వారా ఆకర్షితులయ్యారు. ఆడిషన్ల సమయంలోనే పోర్న్ చిత్రాల్లో నటించాలని చెప్పి.. నెలకు రూ. 1 నుండి రూ.2 లక్షల వరకు సంపాదన ఉంటుందని ఆశ చూపుతారు.
సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లను ఉపయోగించి మోడళ్లను నియమించుకుంటుంది ఈ జంట. ఈడీ దాడుల్లో ఈ ఫ్లాట్లో ఒక ప్రొఫెషనల్ వెబ్క్యామ్ స్టూడియోను కనుగొన్నారు. ఇది ఓన్లీఫ్యాన్స్ వంటి అడల్ట్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్లలో కంటెంట్ను ప్రసారం చేయడానికి ఉపయోగపడుతుంది. దాడి సమయంలో ముగ్గురు మహిళలు ఆన్లైన్లో కనెక్ట్ అయి పనిచేస్తూ కనిపించారు. ఈడీ వాని నుంచి స్టేట్ మెంట్ తీసుకుంది. ఈ దందా నుంచి వీళ్లు సంపాదించిన ఆదాయంలో 75 శాతం ఉంచుకుని 25 శాతం మాత్రమే మోడల్స్కు ఇస్తూ గుట్టు చప్పుడు కాకుండా దందా నడుపుతున్నారు.
ప్రారంభంలో కస్టమర్స్ నుంచి క్రిప్టోకరెన్సీ ద్వారా చెల్లింపులు స్వీకరించేవారు. ఆ తర్వాత విదేశీ కరెన్సీని తీసుకునేవారు. టెక్నియస్ లిమిటెడ్ ద్వారా నెదర్లాండ్స్లోని ఒక బ్యాంక్ ఖాతాలో రూ. 7 కోట్లు బదిలీ చేసినట్లు ఈడీ గుర్తించింది. ఈ నిధులను అంతర్జాతీయ డెబిట్ కార్డులను ఉపయోగించి భారతదేశంలో నగదు రూపంలో విత్డ్రా చేశారు. ఈ రాకెట్ ద్వారా వేలాది మంది మహిళలను నియమించి ఉండవచ్చని దర్యాప్తు సంస్థ తెలిపింది. పూర్తి విషయాలు దర్యాప్తు తర్వాత వెల్లడిస్తామని ఈడీ అధికారులు తెలిపారు.