
న్యూఢిల్లీ: విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (ఎఫ్ఐఐలు) వరుసగా ఎనిమిదో సెషన్లోనూ షేర్లను భారీగా కొన్నారు. గురువారం ఒక్క రోజే రూ.8,250 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. ఈ ఏడాది మార్చి 27 తర్వాత అతిపెద్ద సింగిల్ డే కొనుగోలు ఇదే. దేశీయ సంస్థాగత పెట్టుబడిదారులు (డీఐఐలు) మాత్రం లాభాలను బుక్ చేసుకున్నారు, రూ.534 కోట్ల విలువైన షేర్లను ఆఫ్లోడ్ చేశారు.
గురువారం ట్రేడింగ్ సెషన్లో, ఎఫ్ఐఐలు రూ.24,089 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేసి, రూ.15,838 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. డీఐఐలు రూ.13,452 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేసి, రూ.13,986 కోట్ల విలువైన షేర్లను అమ్మేశారు. ఈ సంవత్సరంలో ఇప్పటివరకు, ఎఫ్ఐఐలు రూ.1.45 లక్షల కోట్ల విలువైన షేర్లను నికరంగా అమ్మగా, డీఐఐలు రూ.1.97 లక్షల కోట్ల విలువైన షేర్లను కొన్నారు.