
- దవాఖానకు వెళ్లకుండా అంబులెన్స్ను తిప్పి పంపిండు
- రోడ్డుపై సీజ్ చేసిన బైక్ ఎప్పుడిస్తారని అడిగినందుకే..
- మంచిర్యాల జిల్లాలో ఘటన
చెన్నూర్, వెలుగు : సీజ్ చేసిన బైక్ను రిలీజ్ చేయాలని అడిగినందుకు మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలం ఆస్నాద్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ బాలకృష్ణ.. తల్లీకొడుకులపై దాడి చేశాడు. బాధితుల కథనం ప్రకారం..చెన్నూర్ టోల్ ప్లాజా సమీపంలో గుడిసె వేసుకొని ఉంటున్న ఎరుకల ఎల్లక్క, ఆమె కొడుకు లక్ష్మణ్ అక్టోబర్24న ఆస్నాద్లోని కులదైవానికి ఊర పందిని బలిచ్చి వస్తుండగా ఎఫ్ఎస్వో బాలకృష్ణ అడ్డుకున్నాడు. అడవి పందిని చంపారంటూ కేసు పెట్టి బైక్ సీజ్ చేశాడు. రూ.25వేలు ఫైన్ కట్టించుకుని బైక్ రిలీజ్ చేయకుండా తిప్పించుకుంటున్నాడు. శుక్రవారం సాయినగర్ సమీపంలో ఎఫ్ఎస్వో కలవగా బైక్ ఎప్పుడు రిలీజ్ చేస్తారని అడిగారు.
‘నన్ను రోడ్డుపై అడుగుతారా’ అంటూ బాలకృష్ణ ఫైర్ అయ్యాడు. ఆఫీసుకు రమ్మనడంతో వెళ్లగా తల్లీకొడుకులను కొరడాతో కొట్టాడు. దీంతో లక్ష్మణ్ స్పృహ తప్పగా హాస్పిటల్కు తీసుకువెళ్లేందుకు 108కు ఫోన్ చేస్తే... డ్రామాలు అడుతున్నారంటూ అంబులెన్స్ను తిప్పి పంపించాడు. ఉదయం 11 గంటల నుంచి 4 గంటల వరకు ఆఫీసులోనే నిర్బంధించాడు. చివరకు అతడి తల్లి ఎలాగో చెన్నూరు హాస్పిటల్కు తీసుకువెళ్లింది. ఎస్ఎఫ్వో బాలకృష్ణ వివరణ కోరగా అడవి పందిని చంపినందుకు బైక్సీజ్ చేశానని, శుక్రవారం తల్లీకొడుకులు ఆఫీస్కు వచ్చి డ్యూటీలో ఉన్న తనను కొట్టారని ఆరోపించాడు. దీనిపై పీఎస్లో ఫిర్యాదు చేయడంతో తాను దాడి చేసినట్టు ఆరోపణలు చేస్తున్నారన్నాడు.