
- రెవెన్యూ వర్సెస్ ఫారెస్ట్
- ఎన్హెచ్ –163 విస్తరణ పనులు అడ్డుకున్న ఫారెస్ట్ ఆఫీసర్లు
- పర్మిషన్ లేదంటూ జేసీబీల స్వాధీనం
- రెండు శాఖల మధ్య కోఆర్డినేషన్ లేక నిలిచిన పనులు
ములుగు, వెలుగు : ఫారెస్ట్, రెవెన్యూ ఆఫీసర్ల మధ్య వివాదాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. హనుమకొండ జిల్లా కేంద్రం నుంచి ములుగు గట్టమ్మ వరకు నేషనల్ హైవే – 163 విస్తరణ పనులు జరుగుతుండగా అటవీ మార్గంలో పర్మిషన్ లేదంటూ ఫారెస్ట్ ఆఫీసర్లు అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న రెవెన్యూ ఆఫీసర్లు అక్కడికి చేరుకొని పనులు ఎందుకు అడ్డుకున్నారని ఫారెస్ట్ ఆఫీసర్లను అడిగారు. దీంతో కంపల్సరీ పర్మిషన్ తీసుకోవాల్సిందేనని ఫారెస్ట్ఆఫీసర్లు జేసీబీలను స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల ములుగు కలెక్టరేట్ బిల్డింగ్ నిర్మాణానికి కేటాయించిన భూమిపై కూడా ఫారెస్ట్ , రెవెన్యూ ఆఫీసర్ల మధ్య గొడవ జరిగింది.
పర్మిషన్ లేదని ఎన్హెచ్ పనుల అడ్డగింత..
ములుగు మండలంలోని మల్లంపల్లి నుంచి గట్టమ్మ వరకు జాకారం ఫారెస్ట్ ఏరియా ఉంది. సుమారు 7కిలోమీటర్ల వరకు నేషనల్ హైవే విస్తరణ పనులు చేయాల్సి ఉండగా సోమవారం కాంట్రాక్టర్ పనులు మొదలు పెట్టారు. దీంతో మల్లంపల్లి, పందికుంట మధ్యలో జరుగుతున్న పనులకు ఫారెస్ట్ ఆఫీసర్లు అడ్డుతగిలారు. రోడ్డుకిరువైపుల ఉన్న చెట్లను తొలగిస్తుండడంతో మూడు జేసీబీలను స్వాధీనం చేసుకున్నారు. దీంతో తహసీల్దార్ సత్యనారాయణ స్వామి ఆదేశాలతో రెవెన్యూ సిబ్బంది అక్కడికి చేరుకొని ఎందుకు పనులు ఆపుతున్నారని వాగ్వివాదానికి దిగారు. రోడ్డుకు ఇరువైపులా రెవెన్యూ భూమి ఉండగా ఎందుకు అడ్డుతగులుతున్నారని ప్రశ్నించారు. అటవీ శాఖ పర్మిషన్ లేనిదే పనులు చేయవద్దని ఫారెస్ట్ ఆఫీసర్లు తేల్చి చెప్పారు.
ఈవిషయం కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని రెవెన్యూ సిబ్బంది చెప్పి అక్కడి నుంచి వెళ్లడంతో పనులు నిలిచిపోయాయి. ఈ విషయంపై తహసీల్దార్ సత్యనారాయణ స్వామిని వివరణ కోరగా ఎన్హెచ్ విస్తరణ పనులు అన్ని శాఖల పర్మిషన్తోనే, ప్రభుత్వ భూమిలోనే జరుగుతున్నాయని వెల్లడించారు. సర్వే నెంబర్లు 53/2 నుంచి 53/19 వరకు, 67/2 నుంచి 67/19 వరకు పాత, కొత్త రికార్డుల్లో, మ్యాప్ లలో సైతం ప్రభుత్వ భూమిగా నమోదై ఉందని స్పష్టం చేశారు. అయితే ఫారెస్ట్, రెవెన్యూ ఆఫీసర్ల మధ్య కోఆర్డినేషన్ లేకపోవడంతోనే అభివృద్ధి పనులు కుంటుపడుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.
పర్మిషన్ తీసుకోవాల్సిందే..
ఫారెస్ట్ ఏరియాలో పనులు చేపడుతున్న ఆఫీసర్లు, కాంట్రాక్టర్లు మా పర్మిషన్ తప్పక తీసుకోవాలి. నేషనల్ హైవే 163 విస్తరణ కోసం ఎలాంటి పర్మిషన్ తీసుకోకుండా మల్లంపల్లి, జాకారం మధ్య పనులు చేస్తున్నారు. అందుకే మూడు జేసీబీలను స్వాధీనం చేసుకున్నాం.
–ఎన్.శంకర్, ములుగు రేంజ్ ఆఫీసర్