
మాజీ క్రికెటర్ బుడుమూరు నాగరాజు మాయమాటలతో వ్యాపారులను మోసం చేస్తూ పోలీసులకు చిక్కాడు. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫొటోను డీపీగా పెట్టుకున్న వాట్సాప్ నెంబర్తో..పీఏగా నమ్మించి మహారాష్ట్రకు చెందిన వ్యాపారులకు కుచ్చుటోపి వేస్తున్న రంజీ మాజీ ప్లేయర్ బుడుమూరు నాగరాజును ముంబై సైబర్ క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నాగరాజు..గతంలోనూ మంత్రి కేటీఆర్ పీఏగా నమ్మబలికి అనేక మోసాలకు పాల్పడ్డాడు. ఈ ఘరానా మోసగాడిపై ముంబై, హైదరాబాద్లతో పాటు దేశ వ్యాప్తంగా 30కి పైగా కేసులు ఉండటం గమనార్హం.
ఎవరీ నాగరాజు...
ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన నాగరాజు బుడుమూరుకు క్రికెట్ ఆట అంటే ఎక్కువ ఇష్టం. ఎంబీఏ చదివిన ఇతడు..2009లో రాష్ట్ర స్థాయిలో అండర్–19 కేటగిరీలో క్రికెట్ ఆడాడు. ఆ తర్వాత స్టేట్ సౌత్ జోన్కు ఎంపికై ఆరు రాష్ట్రాల జట్టులతో పోటీపడ్డాడు. ఈ మ్యాచుల్లో గంగా గోవా జట్టుతో ఆడుతున్న సమయంలో నాగరాజు ముక్కుకు తీవ్ర గాయమైంది. దీంతో అతను రెండేళ్ల పాటు క్రికెట్కు దూరమయ్యాడు. ఆ తర్వాత ఇండియన్ ప్రీమియర్ కార్పొరేట్ లీగ్ లో ఎయిర్ ఇండియా టీమ్ తరఫున ఆడాడు. దీంతో 2014లో నాగరాజును ఆంధ్రా రంజీ జట్టుకు సెలక్టర్లు ఎంపిక చేశారు. అయితే 2016లో నాగరాజు ఓ రికార్డు సృష్టించేందుకు ప్రయత్నించాడు. లాంగెస్ట్ ఇండివిడ్యువల్ నెట్ సీజన్ పేరుతో 82 గంటల పాటు నిర్విరామంగా బ్యాటింగ్ చేయాలని చూశాడు. ఆ తర్వాత నాగరాజు బెట్టింగ్ వైపు మళ్లాడు. మొదట్లో బుకీలతో సంప్రదించి బెట్టింగ్ పెట్టేవాడు. ఆన్లైన్ బెట్టింగ్ పెట్టి తీవ్రంగా నష్టపోయాడు. చివరకు డబ్బు కోసం మోసాలు చేయడం ప్రారంభించాడు.
ఏపీ సీఎం ఫొటోతో మోసం..
డబ్బు కోసం మోసాలకు పాల్పడటం ప్రారంభించిన నాగరాజు..అందుకు అనుగుణంగా ట్రూ కాలర్ యాప్, వాట్సాప్లను తన నెంబర్ను ప్రముఖుల పీఏల పేరుతో మార్చుకున్నాడు. అంతేకాదు ప్రముఖుల ఫొటోలను తన వాట్సాప్ డీపీగా పెట్టుకుంటాడు. ఇక 2021లో మంత్రి కేటీఆర్ పీఏ తిరుపతిరెడ్డిని అంటూ డబ్బు దండుకోవడానికి ప్రయత్నించి బుక్కయ్యాడు. తాజాగా ముంబైలో ఎలక్ట్రానిక్ షాపులు నిర్వహించే సంస్థ యజమానిని నాగరాజు టార్గెట్ చేశాడు. ఏపీ సీఎం జగన్ ఫొటోను డీపీగా పెట్టుకున్న వాట్సాప్ నెంబర్తో మెసేజ్ చేశాడు. జగన్ ఏపీగా నమ్మబలికాడు. ఓ క్రికెట్ మ్యాచ్కు స్పాన్సర్గా ఉండాలంటూ కోరాడు. వాయిస్ ఫిష్షింగ్ టెక్నాలజీ వినియోగించి గొంతు మార్చి మాట్లాడాడు. ఇది నిజమని నమ్మిన ఆ యజమాని నాగరాజుకు రూ.12 లక్షలు చెల్లించారు.
సిమ్ కార్డుతో దొరికాడు..
నాగరాజుకు డబ్బులిచ్చి మోసపోయానని గ్రహించిన బాధితుడు జనవరి 13న ముంబై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. హైటెక్ పంథాలో మోసాలు చేస్తున్న నాగరాజును..సిమ్ కార్డు తన పేరు మీదనే తీసుకున్నాడు. దీని ఆధారంగా ముంబై సైబర్ క్రైమ్ పోలీసులు నాగరాజును హైదరాబాద్లో అరెస్టు చేసి తీసుకువెళ్లారు. నాగరాజుకు సంబంధించిన వివిధ బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ.7.66 లక్షలను పోలీసులు ఫ్రీజ్ చేశారు.