MP శ్రీకృష్ణ దేవరాయలు ఫ్లెమింగో పక్షి లాంటివాడు.. ఇలాంటి బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదు: పేర్ని నాని

MP శ్రీకృష్ణ దేవరాయలు ఫ్లెమింగో పక్షి లాంటివాడు.. ఇలాంటి బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదు: పేర్ని నాని

తాడేపల్లి: టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలపై మాజీ మంత్రి పేర్ని నాని ఫైర్ అయ్యారు. మంగళవారం (మార్చి 25) తాడేపల్లిలో పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ.. ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు బెదిరింపులకు ఎవరూ భయపడరని.. పార్లమెంటును అడ్డుపెట్టుకుని కక్షసాధింపు రాజకీయాలు చేయటం మానుకోవాలని అన్నారు. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్రంలో భారీ లిక్కర్ స్కామ్ జరిగిందని.. టీడీపీ ఎమ్మెల్యేలు లిక్కర్ షాపులను చెరపట్టారని ఆరోపించారు. 

ప్రతిచోటా బెదిరించి కమీషన్లు, లంచాలు తీసుకుంటున్నారని.. ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు వీటిపై పార్లమెంటులో మాట్లాడాలని సూచించారు. వైసీపీ ప్రభుత్వంలో వేలకోట్లు దేశం దాటి వెళ్లినట్టు లావు శ్రీకృష్ణ దేవరాయలు ఆరోపణలు చేశారు. అప్పుడు ఆయన వైసీపీలోనే ఉన్నారు కదా..? మరీ అప్పుడు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. 

ALSO READ | బెట్టింగ్ యాప్స్ డ్రగ్స్ కంటే డేంజర్.. సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేసిన కేఏ పాల్

లావు శ్రీకృష్ణ దేవరాయలు ఫ్లెమింగో పక్షి లాంటివాడని.. టీడీపీ గూటిలో చేరి చంద్రబాబు మాటలను చిలక పలుకులుగా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. పల్నాడు ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని శ్రీకృష్ణదేవరాయలు రాష్ట్ర అభివృద్ధి కోసం వాడితే బాగుంటుందని.. అంతేకానీ అధికారం అడ్డుపెట్టుకుని వైసీపీ నేతలపై కేసులు పెట్టించడం సరికాదని చురకలంటించారు.

విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ప్రయివేటీకరణను ఆపటానికి, పోలవరానికి నిధులు తేవటానికి, రాయలసీమ లిఫ్టు ఎత్తిపోతల పథకం కోసం, దక్షినాది రాష్ట్రాల్లో తగ్గబోతున్న సీట్ల గురించి తన అధికారాన్ని వాడుకుంటే మంచిదని హితవు పలికారు. కనీసం పల్నాడులో నీటి ఎద్దడి గురించి కూడా మాట్లాడటం లేదని.. కేవలం చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్టు చదవటమే లావు శ్రీకృష్ణ దేవరాయలు పనిగా పెట్టుకున్నారని విమర్శలు గుప్పించారు.

ఇప్పుడు లిక్కర్ వ్యాపారం మొత్తాన్ని టీడీపీ నేతలే చెరబట్టారు.. కమీషన్లు, వాటాల కోసం వ్యాపారుల గొంతు మీద కత్తి పెట్టారన్నారని ఆరోపించారు. 
సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‎తో సహా అందరూ దోపిడీ చేస్తున్నారని.. ఇదికదా అసలైన లిక్కర్ స్కాం అని ఎద్దేవా చేశారు. ఇవేమీ మీకు కనపడటం లేదా ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు అని నిలదీశారు. 

ALSO READ | జగన్ వచ్చేది అధికారంలోకి కాదు.. రాజమండ్రి సెంట్రల్ జైలుకు : టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్య

అవినీతి, అక్రమాలు చేసిన చంద్రబాబుకు గతంలో ఐటీ శాఖ నోటీసులు ఇచ్చింది. దానిపై ఐటీ శాఖ పూర్తి విచారణ ఎందుకు చేయటంలేదో శ్రీకృష్ణ దేవరాయలు ప్రశ్నించాలని డిమాండ్ చేశారు.  పాపపు సొమ్ము చంద్రబాబుకి చేరిందని ఈడీ చెప్పింది. దానిపై చంద్రబాబుకు శిక్షలు వేయమని శ్రీకృష్ణ దేవరాయలు గట్టిగా అడగాలని అన్నారు.

స్కిల్ స్కాం విచారణ మొదలవగానే చంద్రబాబు పీఏ శ్రీనివాస్ దుబాయ్ ఎందుకు పారిపోయాడో ప్రశ్నించాలి. శ్రీనివాస్ పదేపదే దుబాయ్ ఎందుకు వెళ్తున్నాడో..? ఆయన వెనుకే లోకేష్ ఎందుకు వెళ్తున్నాడో ఎంపీ లావు ప్రశ్నించాలని సూచించారు. బేవరేజ్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డితో తప్పుడు వాంగ్మూలం తీసుకుని వైసీపీ నేతలను అరెస్టు చేయాలని చూస్తున్నారని.. ఏదోలా జగన్ మీద అక్రమ కేసులు పెట్టాలని ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.