హైదరాబాద్: తమ పార్టీకి తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని బీఆర్ ఎస్ లీడర్, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఇవాళ తెలంగాణ భవన్లో మీడియాతో ఆయన మాట్లాడారు. రాజకీయా ప్రయోజనాలు తమకు ముఖ్యం కాదన్నారు. కొందరి ప్రయోజనాల కోసం రాష్ట్రంలో అభివృద్ధిని నిర్లక్ష్యం చేస్తే తాము ఊరుకోబోమని హెచ్చరించారు. నీళ్లు, నీధులు, నియామకాల్లో అన్యాయం జరిగిందని పోరాటం చేసి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నామన్నారు.
రాష్ట్రం ఏర్పాటైనా కొన్ని అంశాలు పరిష్కారం లేదన్నారు. ఇప్పటివరకు పరిష్కారం కాని 9వ షెడ్యూ ల్ లో ఉన్న 30 సంస్థలు, 10వ షెడ్యూల్ లో ఉన్న 102 సంస్థల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అభివృద్ధికి ఆటంకం లేకుండా పరిష్కారం చేసుకుని రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకొని వెళ్లాలని సూచించారు. రాష్ట్ర ఏర్పాటు తరువాత ఆంధ్ర ప్రజలను వెళ్లగొడతారని ప్రచారం చేశారని, కేసీఆర్ అధికారంలో రాగానే వారిని చక్కగా చూసుకున్నామన్నారు. రాష్ట్ర ఏర్పాటులో అమరుల త్యాగాలు మర్చిపోలేనివన్నారు.