సీఎం రేవంత్​ జోలికొస్తే ఉరికించి కొడతాం

సీఎం రేవంత్​ జోలికొస్తే ఉరికించి కొడతాం
  • కుత్బుల్లాపూర్ ​ఎమ్మెల్యేకు కూన శ్రీశైలం గౌడ్ వార్నింగ్.

జీడిమెట్ల, హైదరాబాద్​ సిటీ, వెలుగు : సీఎం రేవంత్​రెడ్డిపై అనుచిత వాఖ్యలు చేస్తే కుత్బుల్లాపూర్ గల్లీల్లో ఉరికించి కొడతామని మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్​ఎమ్మెల్యే వివేకానంద్​కు వార్నింగ్ ​ఇచ్చారు. మంగళవారం గాజులరామారంలోని కాంగ్రెస్ ​పార్టీ ఆఫీసులో జాతీయ జెండా ఆవిష్కరించి మాట్లాడారు. టీడీపీలో గెలిచి బీఆర్ఎస్ లో చేరిన వివేకానంద్​కు పార్టీ ఫిరాయింపుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. ప్రశ్నించే వారిపై దాడులు చేయడం వివేకానంద్​ నైజం అని మండిపడ్డారు. అనేక మందిపై దాడులు చేసిన చరిత్ర వివేకానంద్​ది అని, ఎన్నికల సమయంలో తనపైనా దాడిచేశాడని చెప్పారు.

తనకు సంస్కారం ఉండటంతోనే తిరిగి దాడి చేయలేదని తెలిపారు. రాష్ట్రంలోని భద్రత గురించి వివేకానంద్ మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. తన భాషను మార్చుకోకపోతే ఎమ్మెల్యేను కుత్బుల్లాపూర్ ​నియోకవర్గంలో తిరగయనియ్యబోమని, గల్లీల్లో ఉరికించి కొడతామని హెచ్చరించారు.