ఆరోగ్యం బాగలేకనే ఇండియాకు రాలేకపోయాను :మహమ్మద్ షకీల్ అమేర్​

ఆరోగ్యం బాగలేకనే ఇండియాకు రాలేకపోయాను :మహమ్మద్ షకీల్ అమేర్​
  • మాజీ ఎమ్మెల్యే మహమ్మద్ షకీల్ అమేర్​ 

బోధన్, వెలుగు : ఆరోగ్యం భాగలేకపోవడంతోనే తాను ఇండియాకు రాలేకపోయానని, కేసులకు భయపడి కాదని మాజీ ఎమ్మెల్యే మహమ్మద్ షకీల్ అమేర్ అన్నారు. ఆదివారం బోధన్​ పట్టణంలోని అప్పా ఫంక్షన్​హాల్​లో బీఆర్ఎస్​ముఖ్యకార్యకర్తలతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా షకీల్ మాట్లడుతూ తన కుమారునిపై ఫేక్​ కేసులు పెట్టి 300 మంది పోలీసులను తన ఇంటిపైకి పంపించి కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురిచేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడం సరికాదన్నారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో తను ఎవర్నీ ఇబ్బంది పెట్టలేదని చెప్పారు. తను పీడీఎస్​రైస్​దందా చేస్తానని బద్నాం చేశారని, తన రైస్​మిల్లులో గవర్నమెంట్​కు సంబంధించి ఒక బస్తా​కూడా బాకీలేనని, ఇందుకు క్లీన్ సర్టిఫికెట్ కూడా​ఇచ్చారని తెలిపారు. 

ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి బ్లాక్​మెయిల్ రాజకీయాలు మానుకోవాలి..

ఎమ్మెల్యే పి.సుదర్శన్ రెడ్డి బ్లాక్​మెయిల్ రాజకీయాలు మానుకొని అభివృద్ధిపై దృష్టి పెట్టాలని సూచించారు. తెలంగాణ పోరాటంలో తనపై ఎన్నో కేసులు పెట్టారని, ఇప్పుడు పెట్టడం కొత్త కాదన్నారు. సుదర్శన్ రెడ్డి ఉమ్మడి రాష్ట్రంలో ఇరిగేషన్ మంత్రిగా ఉన్నా బోధన్​అభివృద్ధికి చేసిందేమీలేదన్నారు. ఆయనకు మంత్రి పదవిపై ఉన్నా మోజు, అభివృద్ధిపై లేదని విమర్శించారు. 18 నెలల కాలంలో బోధన్​లో ఎలాంటి అభివృద్ధి పనులు చేశారో సుదర్శన్​రెడ్డి చెప్పాలని డిమాండ్​చేశారు.

ఆయన వైఖరితో కాంగ్రెస్ కార్యకర్తలు సైతం అయోమయంలో పడ్డారని తెలిపారు. బీఆర్ఎస్​ నాయకులు, కార్యకర్తలు ఏకమై కాంగ్రెస్​ ప్రభుత్వం చేస్తున్న నీచరాజకీయాలను ఎదుర్కొవాలని సూచించారు. ఈనెల 27న వరంగల్ లో జరిగే రజతోత్సవ మహాసభను విజయవంతం చేయాలని పార్టీశ్రేణులకు పిలుపునిచ్చారు. సమావేశంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు రవీంద్రయాదవ్, డీసీసీబీ డైరెక్టర్, గిర్ధవర్ గంగారెడ్డి, బోధన్​, సాలూర, ఎడపల్లి, నవీపేట్, రెంజల్​మండలాల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.