జీఓ 29ను రద్దు చేయాలి : మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్

జీఓ 29ను రద్దు చేయాలి : మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్
  • ముగిసిన 48గంటల ఉపవాస దీక్ష

గూడూరు, వెలుగు: బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు అన్యాయం జరిగే విధంగా ప్రభుత్వం తీసుకొచ్చిన 29 జీవోను వెంటనే రద్దు చేయాలని మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ డిమాండ్ చేశారు. ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ గూడూరులో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన 48 గంటల ఉపవాస దీక్ష ముగింపు కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా దీక్షలో కూర్చున్న సురేశ్, రహీం, హైమద్, ఎల్లయ్య, విజయ్, అనిల్, రాజుకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింప చేశారు.

అనంతరం శంకర్​నాయక్​మాట్లాడుతూ రైతు ప్రభుత్వం అని చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వం రైతుబంధు, రెండు లక్షల రుణమాఫీ ఇవ్వకుండా మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలకు రూ.లక్షతోపాటు తులం బంగారం ఇస్తామని మహిళలను మోసం చేసిందన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ వీరన్న, వెంకన్న, కఠార్ సింగ్, రాములు తదితరులు పాల్గొన్నారు.