
లోక్ సభ ఎన్నికలముందు కాంగ్రెస్ లోకి వలసలు జోరందుకున్నాయి. బీఆర్ఎస్ కు చెందిన కీలక నేతలు సైతం ఆపార్టీని వీడి కాంగ్రెస్ లో చేరుతున్నారు. లేటెస్ట్ గా ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ కు పెద్ద షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్ ఇవాళ కాంగ్రెస్ లో చేరారు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ దీపాదాస్ మున్షి కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు.
పురాణం సతీష్ కాంగ్రెస్ లో చేరికకు చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీ కృష్ణ కీలకంగా వ్యవహరించారు.
కేసీఆర్ చెప్పేవన్నీ అబద్ధాలె: సతీష్
ఉద్యమ సమయం నుండి కేసీఆర్ తో ఉన్నానని పురాణం సతీష్ అన్నారు. బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం ఆగమైపోయిందన్నారు. బానిస సంకెళ్ల మధ్య ఇంతకాలం ఉన్నామని.. అవినీతి ఆరోపణలు , ఫోన్ ట్యాపింగ్ లతో బీఆర్ఎస్ ఇరుక్కుపోయిందని ఆరోపించారు. కేసీఆర్ చెప్పేవన్నీ అబద్ధాలేనని విమర్శించారు. తెలంగాణ సంపదను దోచుకున్నారని ధ్వజమెత్తారు. యాదాద్రి లో కూడా 400 కోట్ల స్కామ్ చేశారని ఆరోపించారు. రేవంత్ ఆధ్వర్యంలో రాష్ట్రం ముందుకు పోతుందని కొనియాడారు. ఆరు గ్యారంటీలతో ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తుందని చెప్పారు. తెలంగాణ ప్రజలను పిచ్చోళ్లను చేసింది కేటీఆర్, హరీష్ రావేనని విమర్శించారు.