
హైదరాబాద్, వెలుగు: ఐ అండ్పీఆర్ జాయింట్డైరెక్టర్ కన్నెకంటి వెంకట రమణ రాసిన వ్యాసాల సంపుటి 'కాకతీయుల గురించి మరికొంత' పుస్తకాన్ని రాష్ట్ర శాసన మండలిలో ప్రతిపక్ష నేత, మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనా చారి ఆవిష్కరించారు. ఆదివారం నాంపల్లిలోని తెలుగు విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో విశ్వ బ్రాహ్మణ ధర్మ పీఠం స్వర్ణోత్సవాలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనా చారి హాజరయ్యారు. ఈ సందర్భంగా ‘కాకతీయుల గురించి మరికొంత...’ పుస్తకంతో పాటు విశ్వబ్రాహ్మణ ధర్మపీఠం సంచాలకులు చొల్లేటి కృష్ణమాచార్యులు రచించిన 'విశ్వ శిల్పి రామప్ప రమణీయ శిల్పకళ' అనే చారిత్రక నవలను ఆవిష్కరించారు.
అనంతరం మధుసూదనా చారి మాట్లాడుతూ.. ప్రపంచీకరణ నేపథ్యంలో కుల వృత్తులు ముఖ్యంగా విశ్వబ్రాహ్మణుల వృత్తులు బాగా దెబ్బతిన్నాయని తెలిపారు. ప్రస్తుతం డబ్బు, రాజ్యాధికారం సమాజాన్ని శాసిస్తున్నాయని చెప్పారు. విశ్వబ్రాహ్మణ జాతిని అభ్యుదయ పథంలో నడిపించడానికి విశ్వ బ్రాహ్మణ ధర్మపీఠం ఒక మార్గ దర్శకంగా పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తెలుగు విశ్వవిద్యాలయం మాజీ రిజిస్ట్రార్ డా. త్రిమూర్తుల గౌరీశంకర్, పద్మశ్రీ కూరెళ్ల విఠలాచార్య, లాలుకోట వెంకటాచారి తదితరులు పాల్గొన్నారు.