
- అమెరికా రక్షణ శాఖ మాజీ ఆఫీసర్ రూబిన్
- పాక్ ఆర్మీ చీఫ్ను టెరరరిస్ట్ గా ప్రకటించాలని కామెంట్
న్యూయార్క్: పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్పై అమెరికా రక్షణ శాఖ మాజీ ఆఫీసర్ మైఖెల్ రూబిన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆసిమ్ మునీర్కు చనిపోయిన అల్-ఖైదా టెర్రరిస్ట్ గ్రూప్ మాజీ చీఫ్ ఒసామా బిన్ లాడెన్కు పెద్ద తేడా ఏమీ లేదని వెల్లడించారు. ఆసిమ్ మునీర్ చావు కూడా లాడెన్లాగే ఉండాలన్నారు. ఈ మేరకు గురువారం ఆయన జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన టెర్రరిస్ట్ అటాక్ పై స్పందించారు. దాడిని తీవ్రంగా ఖండించిన మైఖెల్ రూబిన్.. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ కాశ్మీర్ను పాకిస్తాన్కు 'జీవనాడి'గా పేర్కొంటూ ఇటీవల చేసిన కామెంట్లే ఈ అటాక్ కు ప్రేరేపించాయని ఆరోపించారు.
పందికి లిప్స్టిక్ పూసినా అది పందే. అలాగే.. పాకిస్తాన్ టెర్రరిజానికి సపోర్ట్ చేయటం లేదనడం కూడా వ్యర్థమే. ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్ ఒసామా బిన్ లాడెన్ గుహలో ఉండేవాడు. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అయిన ఆసిమ్ మునీర్ రాజభవనంలో ఉంటున్నాడు. ఇద్దరి మధ్య అదొక్కటే తేడా..మిగతాదంతా ఒక్కటే. వారిద్దరికి పెద్ద తేడా ఏమీలేదు. అందుకే వారి ముగింపు కూడా ఒకేలా ఉండాలి. ఆసిమ్ మునీర్ను టెర్రరిస్టుగా , పాకిస్తాన్ ను టెర్రరిజాన్ని ప్రేరేపించే దేశంగా ప్రకటించాలని అమెరికాను కోరుతున్నా" అని మైఖెల్ రూబిన్ పేర్కొన్నారు.
1990లో బిల్ క్లింటన్ భారత్లో పర్యటించినప్పుడు టెర్రరిస్టులు అటాక్ చేశారని.. మళ్లీ ఇప్పుడూ అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భారత్లో పర్యటించినప్పుడే దాడికి పాల్పడ్డారని గుర్తుచేశారు. ఇలాంటి దాడుల ద్వారా పాకిస్తాన్ అంతర్జాతీయ దృష్టిని మళ్లించాలని చూస్తోందని మైఖెల్ రూబిన్ ఆరోపించారు. పహల్గామ్ దాడికి భారత్ ప్రతీకారం తీర్చుకోవాలని కోరారు.