
కాజీపేట, వెలుగు: హన్మకొండ జిల్లా కాజీపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక హోటల్ లో ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ బెట్టింగ్ ఆడుతున్న నలుగురు వ్యక్తులను టాస్క్ఫోర్స్ సీఐ బాబులాల్ పట్టుకున్నారు. కరీంనగర్ జిల్లా వీణవంకకు చెందిన గొడుగు శ్రీనివాస్(39), గొడుగు రమేశ్(42), సముద్రాల శ్రీనివాస్(35), బొంకూరి సంతోష్(30) ఒక హోటల్ లో శనివారం క్రికెట్ మ్యాచ్ బెట్టింగ్ ఆడుతున్నట్లు పక్కా సమాచారం అందడంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. బెట్టింగ్ ఆడుతున్న నలుగురిని పట్టుకుని కాజీపేట పోలీస్ స్టేషన్ లో అప్పగించినట్లు టాస్క్ ఫోర్స్ సీఐ బాబులాల్ తెలిపారు.
ముగ్గురిపై కేసు..
శాయంపేట(ఆత్మకూర్): ఐపీల్ బెట్టింగ్కు పాల్పడిన ముగ్గురిపై ఆత్మకూర్ పీఎస్లో కేసు నమోదు చేసినట్లు టాస్క్ఫోర్స్ ఏసీపీ మధుసూదన్ తెలిపారు. హనుమకొండ జిల్లా ఆత్మకూర్ మండలం పెద్దాపూర్ గ్రామంలో డిఫాబెట్, గోల్డెన్–365 వంటి ఆన్లైన్ వెబ్సైట్లో అదే గ్రామానికి చెందిన ముక్కల రాజు, నల్గొండకు చెందిన మర్రి సుధీర్కుమార్, మర్రి సురేశ్లో బెట్టింగ్ ఆడుతుండగా, పక్కా సమాచారంతో దాడులు చేసినట్లు చెప్పారు. రాజును పట్టుకోగా మరో ఇద్దరు తప్పించుకున్నట్లు ఏసీపీ తెలిపారు. రూ.42,100 నగదు, స్మార్ట్ఫోన్ను స్వాధీనం చేసుకుని కేసు నమోదుచేసి ఆత్మకూర్ పోలీస్స్టేషన్లో అప్పగించినట్లు చెప్పారు.