
స్టార్టప్స్లో రాష్ట్రానికి ఆరో స్థానం
కేంద్ర ఎకనమిక్ సర్వేలో వెల్లడి
సుస్థిర అభివృద్ధిలో ఫ్రంట్ రన్నర్
సర్వీస్సెక్టార్ పనితీరులోనూ ఆరో ప్లేస్.. ఐదేండ్ల సగటు వృద్ధిలో టాప్
గ్రాస్ స్టేట్డొమెస్టిక్ప్రొడక్ట్ (జీఎస్డీపీ)లో మన రాష్ట్రం దేశంలో నాలుగో ప్లేస్లో నిలిచింది. 2018–19లో రాష్ట్ర జీఎస్డీపీ 15.0 శాతంగా నమోదైంది. అంతకుముందు ఏడాది ఇది 14.4 శాతమే. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన ఎకనమిక్ సర్వేలో ఈ విషయం వెల్లడైంది.
18.0 శాతం జీఎస్డీపీతో పశ్చిమ బెంగాల్ మొదటి స్థానంలో, 15.3 శాతంతో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో, 15.2 శాతంతో బిహార్ మూడో స్థానంలో ఉన్నాయి. ఐదేండ్ల క్రితం తెలంగాణ ఏర్పడినప్పుడు అంతంత మాత్రంగానే ఉన్న జీఎస్డీపీ మెల్లగా పెరుగుతూ వస్తోంది. 2014–-15లో 11.8 శాతంగా ఉండగా, 2015-–16లో 14.6 శాతానికి పెరిగింది. 2016-–17, 2017–18 లో 14.4 శాతంగానే నమోదైంది. గత ఫైనాన్షియల్ ఇయర్లో తొలిసారిగా 15 శాతానికి పెరిగింది.
సర్వేలో రైతు బంధు ప్రస్తావన
ఎకనమిక్ సర్వే రిపోర్ట్లోని ఇన్వెస్ట్మెంట్ సపోర్ట్ స్కీమ్స్ విభాగంలో రాష్ట్రం అమలు చేస్తున్న రైతు బంధు పథకాన్ని ప్రస్తావించారు. రైతులకు పెట్టుబడి సాయం అందించే కొత్త భావనను తెలంగాణ సర్కారు తీసుకొచ్చిందని పేర్కొన్నారు. 2018 ఖరీఫ్ నుంచి పథకం అమలవుతోందని, 2018–19లో రూ.12,000 కోట్లు ఖర్చు చేయగా, 51.5 లక్షల మంది రైతులు లబ్ధి పొందారని వివరించారు. వారికి నేరుగా నగదు బదిలీ చేస్తున్నారని, 2019–20 నుంచి పెట్టుబడి సాయాన్ని పెంచారని పేర్కొన్నారు.
ఎస్డీజీ ఫ్రంట్ రన్నర్ జాబితాలో తెలంగాణ
సస్టెయినబుల్ డెవలప్మెంట్ గ్రోత్ (ఎస్డీజీ)లో రాష్ట్రాలకు కేంద్రం 100 మార్కులు ఇస్తోంది. ఇందులో 65 మార్కులపైన పొందిన రాష్ట్రాలను ఫ్రంట్ రన్నర్ రాష్ట్రాలుగా పేర్కొంటుంది. ఈ ఎస్డీజీ ఇండెక్స్లో కేరళ, హిమాచల్ ప్రదేశ్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, గోవా, సిక్కిం, చండీగఢ్, పాండిచ్చేరి ఫ్రంట్ రన్నర్ రాష్ట్రాలుగా నిలిచాయి.
సర్వీస్ సెక్టార్ పనితీరులో ఆరో స్థానం
సర్వీస్ సెక్టార్ పర్ఫామెన్స్లో తెలంగాణ ఆరో స్థానంలో నిలిచింది. గ్రాస్ స్టేట్ వాల్యూ యాడెడ్ (జీఎస్వీఏ)లో సర్వీస్ సెక్టార్ వాటా.. తెలంగాణలో 64.7 శాతంకాగా, టాప్లో నిలిచిన చంఢీగడ్లో 86.7, ఢిల్లీలో 84.1 శాతంగా ఉంది. సిక్కిం 26.8 శాతంతో చివరి స్థానంలో నిలిచింది. గత ఐదేండ్లలో తెలంగాణ సర్వీస్ సెక్టార్ పనితీరు సగటు వృద్ధిరేటు 11.2 శాతంగా నమోదై.. దేశంలోనే ఫస్ట్ ప్లేస్లో నిలిచింది. త్రిపురలో తక్కువగా 3% గ్రోత్రేట్ ఉంది.
స్టార్టప్స్లో ఆరో స్థానం
స్టార్టప్ ఇండియా స్కీమ్ కింద 2016 నుంచి ఇప్పటివరకు ఎంటర్ప్రెన్యూర్లు దేశవ్యాప్తంగా 27,084 కొత్త కంపెనీలు ప్రారంభించారు. అందులో తెలంగాణకు చెందినవి 1,485 (5.5 శాతం) ఉన్నాయి. దేశవ్యాప్తంగా చూస్తే రాష్ట్రం ఆరో స్థానంలో ఉంది. 5,119 స్టార్టప్స్తో మహారాష్ట్ర టాప్లో.. 3,954 కంపెనీలతో కర్నాటక రెండో స్థానంలో.. 3,467 కంపెనీలతో ఢిల్లీ మూడో స్థానంలో.. 2,166 కంపెనీలతో ఉత్తర ప్రదేశ్ నాల్గో స్థానంలో నిలిచాయి.