ఫ్రాన్స్ హైస్పీడ్ రైల్వే నెట్​వర్క్​పై దాడి

ఫ్రాన్స్ హైస్పీడ్ రైల్వే నెట్​వర్క్​పై దాడి
  • రైలు పట్టాలు ధ్వంసం.. పలు ట్రైన్లకు నిప్పు
  •     ఒలింపిక్స్ గేమ్స్ ఓపెనింగ్​కు ముందు ఘటన
  •     8 లక్షల మందిపై ప్రభావం..దేశవ్యాప్తంగా హైఅలర్ట్

పారిస్:  ఫ్రాన్స్ హైస్పీడ్ రైల్వే నెట్ వర్క్‌‌పై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. రైలు పట్టాలను ధ్వంసం చేశారు. పలు రైళ్లకు నిప్పు పెట్టి విధ్వంసం సృష్టించారు. మరికొన్ని గంటల్లో ఒలింపిక్స్ గేమ్స్ ప్రారంభం అవుతాయనడానికి ముందు ఈ ఘటన జరిగింది. ఈ దాడితో 8 లక్షల మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు అధికారులు వెల్లడించారు.

ఈ ఘటనపై ఉన్నత స్థాయి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ‘‘గుర్తు తెలియని వ్యక్తులు రైల్వే ట్రాన్స్​పోర్ట్ సిస్టమ్​పై దాడి చేశారు. ఈ దాడిని విద్రోహ చర్యగా భావిస్తున్నాం. టీజీవీ నెట్​వర్క్ స్తంభించిపోవడంతో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. చాలా మార్గాల్లో రైల్వే సర్వీసులను రద్దు చేయాల్సి వచ్చింది. ఒలింపిక్స్ గేమ్స్ ప్రారంభానికి కొన్ని గంటల ముందే ఈ దాడి జరిగింది.

అట్లాంటిక్, నార్తర్న్, ఈస్ట్రన్ రైల్వే నెట్​వర్క్ దెబ్బతిన్నది. గురువారం అర్ధరాత్రి ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు’’ అని ఎస్ఎన్​సీఎఫ్ అధికారులు అన్నారు. ఒలింపిక్స్ గేమ్స్​కు.. రైల్వే నెట్​వర్క్​పై దాడులకు సంబంధం ఉందా? అన్న కోణంలో విచారణ చేస్తున్నామని అక్కడి అధికారులు తెలిపారు. నెట్​వర్క్​ను పునరుద్ధరించడానికి రెండు నుంచి మూడు రోజులు పడుతుందన్నారు. కాగా, రైల్వే నెట్​వర్క్​పై దుండగుల దాడి నేపథ్యంలో.. ఒలింపిక్స్ క్రీడా ప్రాంగణానికి గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.